Mahesh Babu: పదేళ్ల నుంచి వాటికి దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన మహేష్ బాబు..
Mahesh Babu: మహేష్ బాబు పేరు వింటే చాలు ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. 46 ఏళ్లలోనూ ఏమాత్రం తగ్గని హ్యాండ్సమ్నెస్తో మెస్మరైజ్ చేస్తుంటారు మహేష్. ఓవైపు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్, మరోవైపు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ తనదైన ఓ ప్రత్యేకతను..
Mahesh Babu: మహేష్ బాబు పేరు వింటే చాలు ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. 46 ఏళ్లలోనూ ఏమాత్రం తగ్గని హ్యాండ్సమ్నెస్తో మెస్మరైజ్ చేస్తుంటారు మహేష్. ఓవైపు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్, మరోవైపు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ తనదైన ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మహేష్ బాబు. సినిమా సినిమాకు క్రేజ్ను పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ దృష్టంతా మహేష్ కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’పై పడింది. ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మహేష్ నటిస్తోన్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై హైప్స్ పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా మహేష్బాబుతో పాటు, దర్శకుడు పరశురామ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా మహేష్ బాబు అంటే ముందుగా అతని గ్లామర్ గురించే మాట్లాడుతుంటారు. మరి అంతటి గ్లామర్ మెయింటెన్ చేస్తున్న మహేష్ అసలు ఏంట తింటారన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మీడియా సమావేశంలోనూ ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి మహేష్ స్పందిస్తూ.. ‘అన్నీ తింటాను. కానీ కరెక్ట్గా తింటా. పెరుగు, స్వీట్స్, జంక్ ఫుడ్ తినను. సుమారు పదేళ్ల నుంచి వాటిని దూరంగా పెట్టా. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు అలవాటు అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చారు మహేష్.
ఇక సినిమా విడుదల తేదీకి ఒకరోజు ముందు మే 11న రాత్రి ఏం చేస్తారు అన్న ప్రశ్నకు మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ‘సినిమా విడుదలంటే కాస్త కంగారు, భయంగా ఉండటం సాధారణమే. కానీ ఈసారి అలా కాదు. ఈ రెండేళ్లలో సినిమా చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సినిమా పూర్తవడంతో సంతోషంగా ఫీలయ్యాం. ఫలితం పట్ల మేము నమ్మకంగా ఉన్నాం. తప్పకుండా 12న బ్లాక్బాస్టర్ కొడతాం’ అని తెలిపారు.