
ఇటీవల అన్ని భాషల్లో బయోపిక్ల ట్రెండ్ జోరందుకుంది. క్రికెటర్లు, సినిమా స్టార్లు, రాజకీయవేత్తలు సహా పలువురి ప్రముఖుల జీవిత చరిత్రలు సిల్వర్ స్క్రీన్పై సందడి చేశాయి. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ గడ్కరీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ కూడా రెడీ అవుతుందని తెలుస్తోంది. బాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. సినిమాపై లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్. ఇక లాలూ బయోపిక్లో ప్రముఖ నటుడు ఓ మై గాడ్ 2 ఫేమ్ పంకజ్ త్రిపాఠీ లీడ్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్ కుమార్ రావ్, విక్కీ కౌశల్, మనోజ్ బాజ్పేయిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
లాలూ తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను ప్రధానంగా ఈ బయోపిక్లో చూపించనున్నట్లు తెలుస్తోంది.
లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తమ అధినేతపై సినిమా తీయాలని యోచిస్తున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రకాష్ ఝా లాలూ బయోపిక్ తీసేందుకు రెడీ అయ్యారని, ఇందుకు అవసరమైన అనుమతులను కూడా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారని తెలుస్తోంది. ఒకసారి స్క్రిప్ట్ ఆమోదం పొందిన వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్రకాష్ ఝా రెడీగా ఉన్నారట. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ బయోపిక్కు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు డైరెక్టర్.
కాగా భారత రాజకీయ చరిత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రత్యేక స్థానం ఉంది. 1973లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ 29 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణల్లో దోషిగా కూడా తేలారు. ముఖ్యంగా పశుగ్రాసం, రైల్వే రిక్రూట్మెంట్ టెండర్లు ఇతర కుంభకోణాల్లో లాలూ ప్రసాద్ యాదవ్పై ఆరోపణలు ఉన్నాయి. మరి బయోపిక్ లో ఈ స్కామ్లను చూపిస్తారా? లేదా?అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.