Salman Khan: సల్మాన్ ఖాన్కు కోర్టు నోటీసులు.. మోసం కేసులో ఆరోపణలు.. అసలు ఏం జరిగిందంటే..
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల కాలంలో వార్తలలో నిలుస్తుంది. మొన్నటి వరకు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించారు. దీంతో ఆయన లుక్స్ పై ఆందోళన చెందారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ హీరోతోపాటు అతని సోదరి అల్విరా ఖాన్లకు కోర్టు నోటీసు జారీ చేసింది. వీరిద్దరిపై మోసం ఆరోపణలు ఉన్నాయి.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయపరమైన చిక్కులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా మోసం కేసులో ఆయనకు, అలాగే అతడి సోదరి అల్విరా ఖాన్లకు చండీగఢ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో దాఖలైన ఒక ఫిర్యాదు నుండి ఈ మొత్తం వివాదం తలెత్తింది. కోర్టు ఇప్పుడు దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ కేసులో, సల్మాన్, అల్విరాతో పాటు మరికొందరికి సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు సల్మా్న్ పేరు మరోసారి వార్తలలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ కేసు ఏంటీ.. అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్.
అసలు విషయానికి వస్తే.. చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా, ‘బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ’ బ్రాండ్ ఫ్రాంచైజీని తీసుకున్నారు. ఈ ఫ్రాంచైజీని ఇచ్చేటప్పుడు కంపెనీ తనకు ఎన్నో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిందని గుప్తా ఆరోపించారు. ‘బిగ్ బాస్’ షోలో సల్మాన్ ఖానే స్వయంగా తన షోరూమ్ను ప్రమోట్ చేస్తారని కూడా ఆయనకు చెప్పారు. అంతేకాదు, షోరూమ్ను ప్రారంభించడానికి సల్మాన్ స్వయంగా చండీగఢ్కు వస్తారని కూడా హామీ ఇచ్చారు. దీనితో పాటు, వస్తువుల అమ్మకం, సరఫరాలో కంపెనీ ఆయనకు పూర్తిగా సహకరిస్తుందని కూడా చెప్పారు. ఈ వాగ్దానాలన్నింటినీ నమ్మి, అరుణ్ గుప్తా రూ. 3 కోట్ల భారీ పెట్టుబడితో చండీగఢ్లో ఒక షోరూమ్ను ప్రారంభించారు.
షోరూమ్ తెరిచిన తర్వాత కంపెనీ ఇచ్చిన హామీలన్నీ ఉల్లంఘించబడ్డాయని అరుణ్ గుప్తా ఫిర్యాదు చేశారు. 2018 నవంబర్లో షోరూమ్ ప్రారంభోత్సవానికి సల్మాన్కు బదులుగా ఆయన బావమరిది ఆయుష్ శర్మ హాజరయ్యారు. 2020లో, షోరూమ్కు సరుకులు సరఫరా చేసే గిడ్డంగిని కంపెనీ మూసివేసింది. సరఫరా కొరత కారణంగా సరుకుల నిల్వలు నిలిచిపోయి, ఆయన వ్యాపారం పూర్తిగా నాశనమైంది. చివరగా, 2021లో అరుణ్ గుప్తా చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత, పోలీసులు సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్ , మరో 8 నుండి 10 మంది అధికారులను పిలిపించారు. కానీ అప్పటికీ, అరుణ్ గుప్తాకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. చివరకు, ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్ , ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థకు సంబంధించిన ఇతర నిందితులందరికీ తమ వాదనలు వినిపించి, సమాధానాలు దాఖలు చేయడానికి 2026 అక్టోబర్ 5 వరకు గడువు ఇచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
