
పంచ్ డైలాగులు పేలుతున్నాయ్. యాక్షన్ థ్రిల్లర్ సెంటిమెంట్ సిన్మాని తలపిస్తోంది పుష్ప ఎపిసోడ్. క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో ఎవరి ఊహకీ అందడంలేదు. హీరోలైతే మాత్రం.. బాధ్యతగా ఉండొద్దా అంటోంది ప్రభుత్వం. సెలబ్రిటీలు సిన్మాకు వెళ్లడమే నేరమా అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇది ముమ్మాటికీ కక్షసాధింపేనంటున్నాయ్ విపక్షాలు. ఎవరివాదన వారిదే.. కానీ ప్రజల దృష్టిలో తప్పెవరిది?.. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదోగానీ.. ఒక్క దుర్ఘటన ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లను పండుగలా నిర్వహించే సినీ పరిశ్రమలో కార్చిచ్చులా రాజుకుంటోంది పుష్ప వివాదం. నాటోన్లీ టాలీవుడ్.. బాలీవుడ్ దాకా ఇప్పుడు అల్లు అర్జున్పై కేసు గురించే చర్చ. అరెస్టయ్యారు, రిమాండ్ అయ్యారు. బెయిలొచ్చినా ఓ రాత్రంతా జైల్లో ఉన్నారు. మ్యాటర్ ఇంతటితో క్లోజ్ అవుతుందనుకుంటే ఇప్పట్లో మంటలు చల్లారేలా కనిపించడంలేదు. డిసెంబర్4. చిక్కడపల్లి సంధ్య థియేటర్. పుష్ప టూ ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇసుకేస్తే రాలనంత జనసందోహం. హీరోని చూసేందుకు పోటెత్తారు అభిమానులు. కానీ అభిమానం ఓ నిండు ప్రాణం తీస్తుందని, మరొకరిని ప్రాణాపాయస్థితిలోకి నెట్టేస్తుందని ఊహించలేదెవరూ. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ మూడువారాలుగా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో ఏ11గా అల్లు అర్జున్పై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు రెండువారాల రిమాండ్ విధించినా.. హైకోర్టు బెయిల్ మంజూరుచేయడంతో...