Koganti Satyam: పోలీసుల అనుమానం నిజమైంది.. ఆయన పేరులో సత్యం ఉంది. కానీ చెప్పేదంతా అసత్యం.. !

Rahul Murder Case: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.

Koganti Satyam: పోలీసుల అనుమానం నిజమైంది.. ఆయన పేరులో సత్యం ఉంది. కానీ చెప్పేదంతా అసత్యం.. !
Koganti Satyam
Follow us

|

Updated on: Aug 24, 2021 | 12:12 PM

Koganti Satyam Criminal History: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. తాజాగా, సోమవారం ఈ హత్య కేసులో మరో నిందితుడు రౌడీషీటర్ కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోగంటి సత్యంను బెంగళూరు నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు పోలీసులు. ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ఏ1 కాగా, అతడి భార్య పద్మజ ఏ2, మరో మహిళ గాయత్రి ఏ3, కోగంటి సత్యం నాలుగో నిందితుడిగా ఉన్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.

కోగంటి సత్యం.. ఖాళీ సీసాలు అమ్మే దగ్గర నుంచి కోట్లాది రూపాయల సంపాదనకు ఎదిగాడు. అనతికాలంలో తన నేర రాజ్యం విస్తరించాడు. కోగంటి సత్యం నేర చరిత్ర అంతా ఇంతా కాదు. 2019లో పంజాగుట్టలో జరిగిన స్టీల్‌ వ్యాపారి రామ్‌ప్రసాద్ మర్డర్‌, రెండోది మొన్నీ మధ్య విజయవాడలో జరిగిన రాహుల్ మర్డర్‌. ఈ రెండింటిలో ఈయనపేరే చాలా గట్టిగా వినిపిస్తోంది. అదేంటీ అంటే.. నేను అమాయకుడ్ని, నాకేం తెలీదు అంటూ కబుర్లు చెప్పాడు కోగంటి. విజయవాడలోనే అతడిపై 30 కేసుల వరకు నమోదయ్యాయి. సినీ నటి వహీదా రెహ్మాన్ కూడా కోగంటి బాధితురాలే.

కోగంటి క్రైమ్‌ హిస్టరీలో మరో మర్డర్‌ కేసు కూడా యాడ్ అయ్యింది. విజయవాడ రాహుల్ హత్యకు ముందు A1 విజయ్‌కు క్రైమ్ పాఠాలు చెప్పింది రౌడీషీటర్ కోగంటి సత్యమే అన్నది దాదాపుగా రుజువైంది. అందుకే A4గా ఉన్న కోగంటిని వెతికి వెతికి మరీ బెంగళూరులో పట్టుకున్నారు పోలీసులు. ఈ అరెస్ట్‌కు నాలుగు రోజుల ముందు.. కోగంటి సత్యాన్ని టీవీ9 ప్రశ్నించింది. మీ పేరు ఎందుకొస్తోంది.. మీకూ రాహుల్‌కి లింకేంటి? విజయ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న మర్డర్‌ మిస్టరీలో కోగంటి హస్తం ఎంత అని ప్రశ్నిస్తే.. ఎప్పుడో పాత పరిచయం తప్ప ఇప్పుడు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకేంటి సంబంధం అంటూ బొంకేశాడు కోగంటి.

టీవీ9 మైక్‌ ముందు ఇంతా బొంకిన కోగంటి ఇప్పుడు పోలీసుల చేతిలో ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం ఆయన్ను విజయవాడకూ తీసుకొచ్చారు. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెడతారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోగంటి ప్లాన్, ఎగ్జిక్యూషన్ ప్రకారమే రాహుల్ మర్డర్ జరిగింది. రాహుల్ హత్యకు మూడు రోజుల ముందు కోరాడ విజయ్‌తో కోగంటి చాలాసార్లు ఫోన్లు మాట్లాడినట్లు గుర్తించాడు. మర్డర్ ఎలా చెయ్యాలి. ఎక్కడికి పారిపోవాలి. ఆ తర్వాత పద్ధతిగా ఎలా లొంగిపోవాలి.. ఇలా అన్నింటినీ ఓ పాఠంలా చెప్పాడట కోగంటి. ఆ తర్వాత తాను విజయవాడలోనే ఉంటూ జరుగుతున్న కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ని చూస్తూ వచ్చాడు. అనుమానాలు రాకుండా, వచ్చినా బలపడకుండా బెజవాడలోనే మకాం వేశాడు. ఆ టైమ్‌లోనే టీవీ9 అతన్ని ప్రశ్నించింది. కానీ.. అబ్బే, నాకేంటి లింకని కొట్టిపారేశాడు.

వ్యాపార లావాదేవీలే ఈ మర్డర్‌కు కారణం . రాహుల్ స్థాపించిన జిక్సిన్ కంపెనీయే మర్డర్ కు మొయిన్ రీజన్ గా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆర్థిక కష్టాల కారణంగా కంపెనీలోని తన వాటాను అమ్మాలని భావించాడు విజయ్ కుమార్. ఆ వాటాను తాను తీసుకోవాలన్నాడు కోగంటి సత్యం. కానీ ఇందుకు రాహుల్ ఒప్పుకోలేదు. దీంతో అతడి మర్డర్‌కు స్కెచ్ వేశారు, అమలు చేశారు. ఓ మనిషిని చంపేశారు.

రాహుల్ మర్డర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే… ముగ్గురు మహిళల పాత్ర. వాళ్లలో ఇద్దరు పద్మజ పేర్లతో ఉన్న మహిళలైతే మరొకరు గాయత్రి. విజయ్‌ కుమార్‌, రాహుల్‌కి పార్టనర్‌. ఒక పద్మజ.. విజయ్‌కి భార్య. మరి మరో పద్మజ ఎవరు? గాయత్రి అనే మహిళకూ రాహుల్‌ మర్డర్‌కి లింకేంటి? ఇవన్నీ ప్రస్తుతానికి మిస్టరీ. అయితే ఇందులో గాయత్రి అనే మహిళ దగ్గర రాహుల్ ఆరు కోట్లు తీసుకున్నాడన్నది టాక్. వేరే బెనిఫిట్ ఏదో చేస్తానని నమ్మించి ఆమెను మోసం చేసినట్లు తెలుస్తోంది. శివ.. కోగంటి అరెస్ట్‌ సరే, ఇంతకీ ఈ కేసులో గాయత్రి, మరో పద్మజ ఎవరు.. వాళ్ల పాత్రపై పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కోగంటి సత్యానికి క్రైమ్‌ చెయ్యడం ఇంత సులువా. అప్పుడు పంజాగుట్టలో అదే చేశాడు. ఇప్పుడు బెజవాడలోనూ అదే చేశాడు. పంజాగుట్టలో రామ్ ప్రసాద్‌ మర్డర్ మ్యాటర్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో మర్డర్ చేయించాలని స్కెచ్ వేసి.. నింపాదిగా అమలు చేశాడు. ఆ తర్వాత మీడియాతో మినిట్‌ టు మినిట్ టచ్‌లో ఉన్నాడు. నేను తిరుపతిలో ఉన్నాను.. మీరే చూస్తున్నారుగా అంటూ కబుర్లు చెప్పాడు. ఇప్పుడు బెజవాడ మర్డర్ మ్యాటర్‌లోనూ అదే థియరీ. స్కెచ్ వేశాడు. పైగా విజయవాడలోనే ఉండి అనుమానం రాకూడదన్నట్లు.. మీడియాతోనే టచ్‌లో ఉన్నాడు. కానీ, పోలీసులక్కడ. క్రైమ్ బ్రెయిన్‌ ఉన్న కోగంటికే అంత ఉంటే, బడా బడా క్రైమ్స్‌ను చేదించే పోలీసులకు ఎంత ఉండాలి. అందుకే వాళ్లు కూడా కోగంటి కథలను నమ్మినట్లే నమ్మి చాన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే విజయ్ నోరు విప్పుతాడని భయపడ్డాడో ఆ వెంటనే స్టేట్‌ దాటేసే ప్లాన్ వేశాడు. పోలీసులు కూడా ప్రీప్లాన్డ్‌గా కన్నేసి ఉంచారు కాబట్టి బెంగళూరులో పట్టేసుకున్నారు. లేదంటే అటునుంచి అటే ఏ కేరళకో గోవాకో చెక్కేసి చుక్కలు చూపించేవాడు.

సాంస్కృతిక రంగానికి చెందిన వాళ్లకు అతనొక కళాభిమాని.. వ్యాపారవేత్తలకు అతనొక బడా బిజినెస్ మ్యాన్. కానీ, పోలీస్ రికార్డుల్లో మాత్రం అతడో రౌడీషీటర్. అతడే కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం. కన్నింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. బెజవాడలో సత్యం గారిదొడ్డి అంటే అక్రమాలకు అడ్డా.. ఎన్నో నేరాలు, మరెన్నో హత్యలు.. అంతకుమించి మోసాలు. ఇదీ స్థూలంగా కోగంటి సత్యం చరిత్ర. తాజాగా స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమేనని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో అతడి నేర చరిత్ర ఒక్కసారి తిరగేస్తే.. కోగంటి సత్యం తొలినాళ్లలో పాత సీసాలు ఏరుకొనే వాళ్ల దగ్గర నుంచి సీసాలు కొని అమ్ముకునేవాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో ఎన్నో నేరాలు చేశాడు. రౌడీషీటర్ ముద్ర పోగొట్టుకునేందుకు పారిశ్రామికవేత్త అవతారం ఎత్తాడు. కష్టపడి పైకొచ్చిన వాళ్లు ఒక రకం.. మోసం చేసి పైకొచ్చిన వాళ్లు రెండో రకం. కానీ, కోగంటి సత్యం ఈ రెండూ కాదు. అతడు మూడో రకం… అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ, అడ్డు తొలగించుకుంటూ పైకొచ్చిన రకం..

పాత సీసాలు కొని అమ్ముకునే కోగంటి సత్యం.. అదే కోవలో ఐరన్ స్క్రాప్‌ను కూడా కొని అమ్మడం ప్రారంభించాడు. విజయవాడలో రైల్వే వ్యాగన్స్ వద్ద కొద్దికొద్దిగా ఇనుము దొంగతనాలు చేసే వారి దగ్గర్నుంచి ఐరన్ కొనడం మొదలుపెట్టాడు. అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరించాడు. వాస్తవానికి కోగంటి సత్యం స్వస్థలం బెజవాడ కాదు. అతడి తండ్రి కోగంటి రామయ్య గుంటూరు జిల్లా ఎడ్లపల్లి నుంచి వ్యాపార నిమిత్తం విజయవాడ వలస వచ్చారు. మంగళగిరిలో స్క్రాప్ దుకాణం నిర్వహించేవారు. కోగంటి సత్యం తల్లిది నిజామాబాద్ జిల్లా బాన్సువాడ.

కోగంటి సత్యం రౌడీయిజానికి మంగళగిరిలోనే బీజం పడింది. 1984-85లో నాటి మంగళగిరి సర్పంచ్‌పై తొలిసారి కోగంటి సత్యం, అతడి అనుచరులు హత్యాయత్నం చేశారు. తాడేపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో సర్పంచ్‌పై దాడి చేసి అతడు మరణించాడని కృష్ణానదిలోకి విసిరేశారు. అయితే.. అతడు అప్పటికప్పుడే మరణించకపోయినా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఆ కేసులోనే తొలిసారిగా కోగంటి సత్యంపై మర్డర్ కేసు నమోదైంది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి కృష్ణలంక తన మకాం మార్చాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

నేరాలు ఇచ్చిన ధీమాతో కాబోలు.. ఐరన్ స్క్రాప్ వ్యాపారం చేస్తూనే కోగంటి సత్యం మెల్లమెల్లగా భూకబ్జాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. అలా సెటిల్మెంట్లు చేసిన డబ్బుతో కొండపల్లిలో ఎస్.డి.వి. స్టీల్స్ ప్రారంభించాడు. ఇదే సమయంలో వరసగా నేరాలు చేస్తూ పోయాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బిషప్ భగవాన్‌దాస్ హత్య కేసులోనూ కోగంటి సత్యమే ప్రధాన నిందితుడు. 1988 మార్చి 12న గాంధీనగర్ ఊర్వసి థియేటర్ దగ్గర నేతల భగవాన్ దాసును కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. డోర్నకల్ రోడ్డులోని 2,400 గజాల స్థలాన్ని భగవాన్ దాస్ నుంచి కోగంటి సత్యం కొనుగోలు చేశారని.. నగదు తీసుకున్న భగవాన్ దాస్ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతోనే కోగంటి సత్యం ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.రంగా హత్య తర్వాత మరింత రెచ్చిపోయాడు కోగంటి.

అయితే, తనకు కోగంటి సత్యం నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నేతల భగవాన్ దాస్ కోరినప్పటికీ సీపీ నాయక్.. గన్‌మెన్లను ఇవ్వకుండా కోగంటి సత్యంకు సహకరించాడని అప్పటలో ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిగా కోగంటి సత్యం బందర్ రోడ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే లీలామహల్‌ను సీపీకి గిఫ్ట్‌గా ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది.1988లో విజయవాడ పోలీస్ కమిషనర్ నాయక్ హయాంలో కోగంటి సత్యంపై రౌడీషీట్ ఓపెన్ చేసారు. అదే సంవత్సరం వంగవీటి రంగా హత్య జరిగింది. రంగా హత్యానంతరం ఆయన అనుచరులు అందరినీ కోగంటి సత్యం చేరదీశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు..

సినీ నటి వహీదా రెహ్మాన్‌కు చెందిన భూమి కబ్జా విషయంలోనూ కోగంటిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై వహీదా విజయవాడలో కేసు పెట్టారు. బెంజి సర్కిల్ వద్ద ఉన్న వహీదాకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూమి నేటికీ కోగంటి సత్యం కబంధ హస్తాల్లోనే ఉందని చెబుతారు.కోగంటి సత్యం మర్డర్ ప్లాన్ చేస్తే ఇక అంతేనని జనం టాక్. కోగంటి కుట్ర నుంచి బతికి బయటపడ్డది ఒక్క కాట్రగడ్డ బాబు మాత్రమేనని చెబుతారు. 2008లో కాట్రగడ్డ బాబుపై కోగంటి సత్యం సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు జరిపించాడని ఓ కేసు నమోదైంది. కాట్రగడ్డ బాబు, కోగంటి సత్యం ఇద్దరూ కలిసి కొద్దిరోజుల పాటు విజయవాడలో వ్యాపారం నిర్వహించారు. దీంతోపాటు భూకబ్జాలకు పాల్పడ్డారు. వాటాల్లో తేడాలు రావడంతో కాట్రగడ్డ బాబుపై కోగంటి దాడి చేసినట్లు తొలుత భావించారు. కానీ, ఇందులోనూ ట్విస్టు బయటపడింది. వాస్తవానికి కాట్రగడ్డ బాబు తండ్రి వెంకటనారాయణ హత్య కేసులో వంగవీటి శంతన్‌కు కోగంటి సత్యం సాయం చేశాడని ఆరోపణ. కాట్రగడ్డ బాబుకు సోదరుడి వరుసైన ముసునూరు శ్రీను 2006లోనే కోగంటి సత్యంపై దాడి చేయించాడని చెబుతారు. ఐదో నెంబర్ రోడ్‌లో సీఎంఎస్ చర్చ్ కాంపౌండ్‌లో కోగంటి సత్యం మంచినీళ్లు తాగుతుండగా.. ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచి స్నైపర్ గన్‌తో కాల్పులు జరిగాయి. కానీ, కోగంటి తప్పించుకున్నాడు.

బందర్ రోడ్‌లో ఉన్న శేషసాయి కళ్యాణ మండపంలో ఓ ఫంక్షన్ సందర్భంగా కోగంటి సత్యంపై మరోసారి దాడి జరిగింది. కళ్లల్లో కారంచల్లి దాడికి పాల్పడటానికి ప్రయత్నించగా.. అది కూడా మిస్ అయింది. ఆ తర్వాత కోగంటి సత్యం, వంగవీటి శంతన్ ఓ కేసులో కోర్టుకు హాజరై వస్తుండగా కాల్పులు జరిగాయి. కోగంటి సత్యం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక కాట్రగడ్డ బాబు నుంచి వరస దాడులతో.. కోగంటి సత్యం అతడిపైనే కాల్పులు జరిపించాడని అప్పట్లో ఓ కేసు నమోదైంది.2010లో దుర్గ కళామందిర్ వద్ద కొంత స్థలాన్ని కబ్జా చేశాడనే అంశంపై కోగంటి సత్యంపై కోకా యాక్ట్ కింద కేసు నమోదైంది. నాటి విజయవాడ పోలీస్ కమిషనర్‌ సురేంద్ర బాబు కొద్ది రోజుల పాటు కోగంటిపై నగర బహిష్కరణ వేటు కూడా వేశారు. ఆ తర్వాత దిండి గణేశ్ మండపం వ్యవహారంలో బోండా ఉమా, కోగంటి సత్యం మధ్య వివాదం నెలకొంది. ఆ వివాదాల్లో కోగంటి సత్యంపై కేసు నమోదైంది. ఇలా కోగంటి సత్యంపై ఒక్క విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 30 కేసుల వరకు ఉన్నాయి. తాజాగా ఐరన్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యం చేసిన కుట్రలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read Also…  Kidnap: సినీఫక్కీలో వ్యాపారవేత్త తనయుడి కిడ్నాప్.. కోట్లు దోపిడీ చేసిన ముఠా.. కట్ చేస్తే..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు