AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadepalli : తాడేపల్లి అత్యాచార కేసు : ఫోన్లు తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అరెస్ట్, అనుమానితుని ఇంట్లో సోదాలు.. తల్లి ఏమంటోందంటే..

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తాడేపల్లిలో సామూహిక అత్యాచార కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా..

Tadepalli : తాడేపల్లి అత్యాచార కేసు  :  ఫోన్లు తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అరెస్ట్,  అనుమానితుని ఇంట్లో సోదాలు.. తల్లి ఏమంటోందంటే..
Accused Mother
Venkata Narayana
|

Updated on: Jun 22, 2021 | 3:32 PM

Share

Tadepalli rape case investigation : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తాడేపల్లిలో సామూహిక అత్యాచార కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. అత్యాచారం తర్వాత బాధితుల సెల్ ఫోన్లు ఎత్తుకెళ్ళిన నిందితులు… సదరు సెల్ ఫోన్లను తాకట్టు పెట్టినట్లు విచారణలో చెప్పడంతో, సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని తాడేపల్లి పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు, తాడేపల్లి సామూహిక అత్యాచార అనుమానితుడు ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితుడి తల్లి మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు. గత నెల రోజుల నుండి కృష్ణ ఇంటికి రావడం లేదని ఆమె తెలిపారు. “కొద్దిసేపటి క్రితం పోలీసులు మా ఇంటిలో తనిఖీలు చేసి నా ఫోన్ తీసుకెళ్ళా‌రు. ఇంట్లోని సామానులన్నీ కింద పడేసి, నానా బీభత్సం చేసి వెళ్లిపోయారు. తన కొడుకు గతంలో నేరాలు చేసినట్లు నాకు తెలియదు. అత్యాచారం చేశాడో లేదో నాకు తెలియదు. గోపితో గత కొంత కాలంగా తిరుగుతున్నాడు.” అని మల్లేశ్వరి తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. సీతానగరం పుష్కరఘాట్ వేదికగా కొందరు దుండగుల ముఠా దోపిడీలు, చైన్ స్నాచింగ్, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేల్చారు. కాగా, సీతానగరం పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న అత్యాచార ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నదీ తీరంలో స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా మోహరించారు. యువతి అత్యాచారానికి గురైన పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు.

Read also :  Mega Compliment : వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని మళ్లీ మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి