AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం పవర్‌హౌస్‌ ప్రమాదానికి కారణం అదేనా.. !

శ్రీశైలం పవర్‌హౌస్‌లో ప్రమాదానికి కారణాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మారం చేసింది. 220 కేవీ డీసీ విద్యుత్‌ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో బ్యాటరీలను ఎందుకు బిగించాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.

శ్రీశైలం పవర్‌హౌస్‌ ప్రమాదానికి కారణం అదేనా.. !
Balaraju Goud
|

Updated on: Aug 25, 2020 | 11:05 AM

Share

శ్రీశైలం పవర్‌హౌస్‌లో ప్రమాదానికి కారణాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మారం చేసింది. 220 కేవీ డీసీ విద్యుత్‌ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో బ్యాటరీలను ఎందుకు బిగించాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అధికారులు, సీఈలు లేకుండా బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై ఆరా తీస్తోంది. బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదని సంబంధిత సిబ్బందిని సీఐడీ ప్రశ్నించింది. పాత బ్యాటరీలు పూర్తిగా పాడయ్యేవరకు అధికారులు ఎందుకు వేచి చూశారన్న కోణంలో అధికారులను విచారించారు సీఐడీ దర్యాప్తు బృందం. మరోవైపు ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి దగ్గర నుంచి సీఐడీ వివరాలు సేకరిస్తోంది.

మరోవైపు శ్రీశైలం పవర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాదం జరిగి ఆరు రోజులైంది. కానీ విద్యుత్తు కేంద్రం లోపలకు పూర్తిగా పోలేని పరిస్థితే నెలకొంది. టన్నెల్‌ కావడంతో ఇంకా వేడి ఆవరించి ఉంది. లోపలికి వెళ్లలేకపోవడంతో దర్యాప్తు కొంత జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. అయితే, ఇవాళ నిపుణుల బృందం లోపలికి ప్రమాదానికి కారణాలు, నష్టంపై అంచనా వేయొచ్చని తెలుస్తోంది.

అటు, ఆరో యూనిట్‌కు సంబంధించిన ఎక్సైలేషన్‌ ప్యానెల్‌లో నిప్పురవ్వలు వచ్చిన వెంటనే.. దీనికి డీసీ కరెంట్‌ సరఫరా ఆటోమేటిక్‌గా ట్రిప్‌ కావాల్సి ఉంది. అలా జరిగి ఉంటే మంటలు ఆగిపోయి అగ్ని ప్రమాదం జరిగి ఉండకపోయేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఆటోమేటిక్‌గా పవర్‌ ట్రిప్‌ కాకున్నా, స్విచ్‌ ద్వారా నిలుపుదల చేసే ఏర్పాటు సైతం ఉంటుంది. ఈ స్విచ్‌ సైతం ఆ కీలక సమయంలో పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనాకు వస్తున్నారు. టర్బయిన్లలో ఉండే జనరేటర్లలోని వైన్డింగ్‌ కాయిల్స్‌ పరిధిలో అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయడానికి ఎక్సైలేషన్‌ ప్యానెల్స్‌ ద్వారా డీసీ విద్యుత్‌ను వాటికి సరఫరా చేస్తారు. దీనితో జనరేటర్‌ రోటర్లు తిరిగి విద్యుదుత్పత్తి జరుగుతుంది.

ప్రారంభంలో డీసీ విద్యుత్‌ను బ్యాటరీల ద్వారా ఎక్సైలేషన్‌ ప్యానెల్‌కు అక్కడి నుంచి వైన్డింగ్‌ కాయిల్స్‌కు పంపుతారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరపడానికి బ్యాటరీలతో సరఫరా చేసే విద్యుత్‌ సరిపోదు. జనరేటర్ల నుంచి ఉత్పత్తి అయిన హైడెల్‌ పవర్‌నే ఏసీ విద్యుత్‌గా మార్చి మళ్లీ జనరేటర్లకు పంపిస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేటప్పుడే ఎక్సైలేషన్‌ ప్యానెల్‌లో స్పార్క్స్‌ వచ్చాయి. అప్పటికప్పుడు ఎక్సైలేషన్‌ ప్యానెల్‌కు పెద్ద మొత్తంలో డీసీ విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోయేదని చెబుతున్నారు. కీలక సమయంలో డీసీ విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేసే స్విచ్‌ పని చేయలేదని నిపుణులు అంటున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో బ్యాటరీలు పని చేయకపోవడంతోనే స్విచ్‌ పని చేయలేదని తెలుస్తోంది.

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల తర్వాత పవర్‌హౌస్‌లో పొగలు అదుపులోకి వచ్చినా పునరుద్ధరణ పనులు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా లేవు. అతికష్టం మీద కేబుల్‌ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పవర్‌హౌస్‌లోని కొన్ని విద్యుత్‌ లైట్లు, ఎగ్జిట్స్‌ ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే భూగర్భ పవర్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరుతున్నట్టు భాస్తున్నారు. దీంతో ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తి చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగో యూనిట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతోనే 9 మంది మృతి చెందారని భావిస్తున్నారు.