ఒడిషాలో అరుదైన జింకను రక్షించిన అటవీ శాఖ అధికారులు
ఒడిషాలోని నయాగర్ ప్రాంతలో ఓ మొరిగే జింకను అటవీ శాఖ అధికారులు రక్షించారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
ఒడిషాలోని నయాగర్ ప్రాంతలో ఓ మొరిగే జింకను అటవీ శాఖ అధికారులు రక్షించారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఓ రైతు ఇంట్లో తనిఖీ చేయగా ఈ మొరిగే జింకను గుర్తించారు. డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ సంఘటనపై స్పందించారు. ఈ మొరిగే జింక అరుదైనదని.. దీని గురించి తమకు ఓ ఇన్ఫార్మర్ సమాచారం ఇవ్వడంతో.. తాము సదరు రైతు ఇంట్లో తనిఖీలు చేపట్టామని.. సమాచారం అందినట్లుగానే అక్కడ ఇంట్లో మొరిగే జింకను గుర్తించామని తెలిపారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రైతు ఇంట్లో తనిఖీ చేసిన సమయంలో అతడు లేకపోవడంతో.. పోలీసులు అతడిని స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో అతడు.. పోలీస్ స్టేషన్కు చేరుకుని సంచలన విషయాలను బయటపెట్టాడు. ఈ జింకను తనకు ఎనిమిది రోజుల క్రితం ఓ పోలీస్ అధికారి ఇచ్చాడని తెలిపాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. ఆ ఆఫీసర్ వివరాలను తీసుకుని.. నోటీసులు పంపించారు. ఘటనపై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పేర్కొన్నారు.