కరోనా నిద్ర పోతుందట.. పాక్ మతాధికారి వింత వ్యాఖ్యలు.. అంతేకాదు.. ఇంకా ఏం చెప్పాడంటే..?
పాకిస్థాన్కు చెందిన ఓ మతాధికారి కరోనా గురించి వింత వ్యాఖ్యలు చేశాడు. కరోనా సోకకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పాడు.

కరోనా మహమ్మారి రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలుత చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఆ తర్వాత బ్రిటన్, యూరప్ దేశాల్లో విజృంభించింది. ఆ తర్వాత.. అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తోంది. ఇక మొన్నమొన్నటి వరకు మన భారత్తో పాటు పొరుగు దేశాల్లో అత్యల్పంగా నమోదైన కేసులు.. ఇప్పుడు లక్షల్లోకి వెళ్లాయి. తాజాగా మన పొరుగుదేశం పాక్లో లక్ష మార్క్ను దాటేసింది. అయితే అక్కడ గత నెలలోనే లాక్డౌన్ కూడా ఎత్తేయడంతో.. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అక్కడ కొందరు మంత్రులు, మత పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే విన్నవారు నవ్వాపుకోలేకపోతున్నారు.
తాజాగా పాకిస్థాన్కు చెందిన ఓ మతాధికారి కరోనా గురించి వింత వ్యాఖ్యలు చేశాడు. కరోనా సోకకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పాడు. అందుకు ఓ విశ్లేషణ కూడా చెప్పడం.. అది విన్న వారంతా ఏం అనాలో అర్ధం కాని పరిస్థితి తలెత్తింది. మనం నిద్రపోయే సమయంలో కరోనా కూడా నిద్రపోతుందని.. మనం మరణిస్తే అది కూడా మరణిస్తుందంటూ వింత వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో పాకిస్థాన్లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఎక్కువ సేపు నిద్ర పోవాలని వైద్యులు చెప్పారని ట్విస్ట్ కూడా ఇచ్చాడు. మనం ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే.. వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా నిద్రపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు పాక్లో హాట్ టాపిక్గా మారాయి. దీనిని అక్కడి ఓ జర్నలిస్ట్ సోసల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.