ట్రంప్ తెచ్చిన భారీ చట్టం.. అమెరికా చరిత్రలో తొలి ఘట్టం

కరోనా బీభత్సంతో తల్లడిల్లుతున్న తమ దేశాన్ని ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ భారీ బిల్లును తెఛ్చి దాన్ని చట్టం చేసేశారు.

ట్రంప్ తెచ్చిన భారీ చట్టం.. అమెరికా చరిత్రలో తొలి ఘట్టం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 28, 2020 | 3:25 PM

కరోనా బీభత్సంతో తల్లడిల్లుతున్న తమ దేశాన్ని ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ భారీ బిల్లును తెఛ్చి దాన్ని చట్టం చేసేశారు. కరోనా వైరస్ బిల్లుగా వ్యవహరిస్తున్న ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. 2 ట్రిలియన్ డాలర్ల అత్యధిక ప్యాకేజీ బిల్లుపై సెనేట్ రెండు రోజులపాటు చర్చించగా.. ప్రతినిధుల సభ దీన్ని ఆమోదించింది. దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా చేరుకోగా…   మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పెద్ద పెద్ద నగరాలు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. 30 లక్షల మందికి పైగా యువత ఉద్యోగాలకోసం ఎదురు చూస్తుండగా.. చిన్న వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు, యువతకు ఉద్యోగాల కల్పనకు ఈ చట్టాన్ని నిర్దేశించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుండగా.. దాన్ని ఓ గాడిన పెట్టేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే ఇంత భారీ ప్యాకేజీని ప్రకటించడం ఇదే మొదటిసారి.

మన దేశ పౌరుల కుటుంబాలకు, సిబ్బందికి, కార్మికులకు, వ్యాపారులకు, యువతకు ఈ చట్టం వల్ల ప్రయోజనం కలుగుతుందని ట్రంప్ అన్నారు. ఇది సభ ఆమోదం పొందేలా చూడడంలో రిపబ్లికన్లతో బాటు డెమొక్రాట్లు కూడా చేతులు కలపడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. చట్టంగా మారిన ఈ బిల్లు ప్రకారం.. అమెరికన్ కుటుంబాలకు 500 బిలియన్ డాలర్లు, చిన్న వ్యాపారులకు రుణాలుగా ఇచ్చేందుకు మరో 500 బిలియన్ డాలర్లు, ఆసుపత్రుల నిర్వహణ, వ్యయానికి 150 బిలియన్ డాలర్లు, స్థానిక ప్రభుత్వాలకు మరో 150 బిలియన్ డాలర్లు వ్యయం చేయనున్నారు. ఉద్యోగార్థులకు నాలుగు నెలలపాటు ఉచిత భృతి కూడా లభించనుంది.