AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో LPG కొరత.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన!

ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వాణిజ్య వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని సూచిస్తోంది. పీఎన్‌జీ మౌలిక సదుపాయాలున్న ప్రాంతాల్లోని ఎల్పీజీ వినియోగదారులు పైప్‌లైన్ గ్యాస్‌కు మారితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. దీనివల్ల సిలిండర్ అవసరం లేదు, గృహ, వాణిజ్య సంస్థలకు ఇది అనుకూలం.

దేశంలో LPG కొరత.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన!
Lpg Cylinder
SN Pasha
|

Updated on: Mar 17, 2026 | 6:00 AM

Share

దేశంలో ఎల్పీజీ సరఫరాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వాణిజ్య వినియోగదారులు వీలైనంతవరకు పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కు మారాలని ప్రభుత్వం సూచించింది. మినిస్ట్రీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కు చెందిన జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా స్థిరమైన ఇంధన సరఫరా కొనసాగేందుకు ఈ చర్యపై ఇటీవల అధికార స్థాయిలో చర్చలు జరిగాయి. ఇప్పటికే పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులు పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లకు మారాలని ఆమె సూచించారు. దీనికి సహకరించేందుకు ప్రభుత్వం గ్యాస్ పంపిణీ సంస్థలతో కలిసి ప్రోత్సాహకాలను అందిస్తోంది.

కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని గ్యాస్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఉదాహరణకు ఇంద్రప్రభాత గ్యాస్‌ లిమిటెడ్‌ మార్చి 31లోపు కొత్తగా కనెక్ట్ అయి గ్యాస్ వినియోగం ప్రారంభించే గృహ వినియోగదారులకు రూ.500 విలువైన ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. అదే విధంగా GAIL, భారత్‌ పెట్రోలియం కూడా వినియోగదారులను పీఎన్‌జీ వైపు ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

అధికారుల ప్రకారం పీఎన్‌జీ అనేది ఎల్పీజీతో పోలిస్తే క్లీన్‌గా దహనం అయ్యే ఇంధనం. ఇది పైప్‌లైన్ల ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా అవుతుంది. అందువల్ల సిలిండర్ డెలివరీలు లేదా నిల్వ అవసరం ఉండదు. ఇది గృహాలు, వాణిజ్య సంస్థలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటీవల సంవత్సరాల్లో ప్రభుత్వం దేశవ్యాప్తంగా నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ ను విస్తరించింది. దీని ద్వారా మరిన్ని ఇళ్లకు, వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో ఇంధన సరఫరా వ్యవస్థను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ పరిస్థితుల్లో పీఎన్‌జీ వినియోగం పెరిగితే ఎల్పీజీ సిలిండర్లపై ఉన్న డిమాండ్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us