లాక్డౌన్ ఎఫెక్ట్ః ఆంధ్ర – తమిళనాడు సరిహద్దులో గోడ
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆంధ్ర, తమిళనాడు మధ్య సాగుతున్న అత్యవసర రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సరిహద్దు హైవేలు మూతపడ్డాయి.
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆంధ్ర, తమిళనాడు మధ్య సాగుతున్న అత్యవసర రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సరిహద్దు హైవేలు మూతపడ్డాయి. అప్పటికప్పుడే ప్రధాన రహదారుల్లో భారీ ప్రహారీ గోడలు వెలిశాయి.
ఏపీలో కరోనా తీవ్ర ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోనూ కేసులు అధికంగా నమోదు కావటంతో సరిహద్దు తమిళనాడు అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీ నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే మార్గాలు మూసివేశారు. చిత్తూరు-తిరుత్తణి మార్గంలో శెట్టింతంగాళ్ దగ్గర.. బొమ్మసముద్రం దగ్గర నేషనల్ హైవేపై.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలో.. రోడ్డుకు అడ్డంగా తమిళనాడు అధికారులు సిమెంటు గోడలు కట్టించారు. ఇలా మూడు చోట్ల రోడ్లపై గోడలు కట్టడం కలకలరేపింది.
అయితే, ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమైన రహదారుల్లో ఇలా గోడలు కట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. తమిళనాడు అధికారుల తీరుపై ఏపీ అధికారులు, స్థానిక పలమనేరు ఎమ్మార్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమిళనాడు అధికారులతో ఏపీ అధికారులు చర్చించనున్నారు.