పరారీలో కరోనా పేషెంట్…పట్టించిన వారికి రూ. 50వేల పరిహారం
క్వారంటైన్ , ఐసోలేషన్లో ఉంచిన రోగులు తప్పించుకు పారిపోతూ అందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అక్కడి పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభన కోనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నాయి. వ్యాధి సోకిన వారందరినీ 14 రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. అయితే, ఇక్కడే పెషేంట్లు అటు అధికారులను, ఇటు వైద్యసిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. క్వారంటైన్ లేదా, ఐసోలేషన్లో ఉంచిన రోగులు తప్పించుకు పారిపోతూ అందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అక్కడి పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు.
మధ్యప్రదేశ్లోనూ కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన జావేద్ ఖాన్ అనే వ్యక్తికి వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో అతన్ని జబల్పూర్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యకళాశాల ఆసుపత్రిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి కరోనా రోగి జావేద్ ఖాన్ పారిపోయాడు. అయితే, కరోనా పెషేంట్ పారిపోయేందుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ఉన్నతాధికారులు ఆరోపించారు. పనిష్మెంట్గా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరుతోపాటు నలుగురు పోలీసు గార్డులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు జబల్పూర్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి పారిపోయినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జబల్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ భరత్ యాదవ్ కోరారు. పారిపోయిన కరోనా రోగి ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహ్రీ ప్రకటించారు.