AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా? – కూనంనేని ఆన్సర్ ఇవే..

సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు భారత్‌లో కమ్యూనిస్టుల ప్రాధాన్యత గురించి చర్చించారు. కేరళ ఉదాహరణతో తమ స్థానాన్ని వివరించారు. తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులు, ఎదురైన సవాళ్లు, శాసనసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం తగ్గడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. ఖమ్మం రాజకీయాలపై కూడా ఈ చర్చలో ప్రత్యేక దృష్టి సారించారు.

భారత్‌లో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా? - కూనంనేని ఆన్సర్ ఇవే..
Kunamneni Sambasiva Rao in TV9 Interview
Ram Naramaneni
|

Updated on: May 30, 2026 | 9:38 PM

Share

భారత్‌లో కమ్యూనిస్టుల రాజకీయ ప్రాధాన్యత, భవిష్యత్తుపై సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయాలను టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయిందని, వారి అవసరం లేదని అనే వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు చేసేవారు కళ్ళుండి చూడలేని వారు, జ్ఞానం ఉండి జ్ఞానాన్ని అప్లై చేయలేని వారు అని సాంబశివరావు అన్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రభుత్వాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వాలు కనుమరుగైన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, కేరళలో సీపీఐ ఇప్పటికీ బలమైన శక్తిగా ఉందని ఆయన ఉద్ఘాటించారు.  బెంగాల్, త్రిపురలలో వివిధ కారణాల వల్ల కమ్యూనిస్టులు పట్టు కోల్పోయినప్పటికీ, కేరళలో తమ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఒకప్పుడు కమ్యూనిస్టుల ఉద్యమ పోరాటం గొప్పదని, కానీ ప్రస్తుతం శాసనసభల్లో తమ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిందని సాంబశివరావు అంగీకరించారు. అయితే, దీనికి కారణం ప్రజల్లో తమ పట్ల విశ్వాసం తగ్గడం కాదని, ఇతర రాజకీయ పార్టీల అవకాశవాదమేనని ఆయన విమర్శించారు. కమ్యూనిస్టులను కేవలం ఉద్యమకారులుగా, యూనియన్ లీడర్లుగా మాత్రమే చూస్తున్నారని, శాసనసభల్లో తమను ప్రతినిధులుగా చూడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి తమను ఉపయోగించుకొని, తర్వాత విస్మరిస్తున్నారని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కమ్యూనిస్టులకు తగిన గౌరవం లభించిందని, వారి బలాన్ని గుర్తించారని సాంబశివరావు గుర్తు చేశారు. తమకు బలం లేక కాదని, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో తమ బలం ఇప్పటికీ చెక్కుచెదరలేదని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొదట కమ్యూనిస్టుల పోరాట చరిత్రను, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను ఘనంగా ప్రశంసించారని, కానీ ఎన్నికల సమయంలో తమను బలహీనపరిచారని ఆరోపించారు. తమను ఎటూ పోలేరు అనే ధీమాతో కేసీఆర్ వ్యవహరించారని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల మద్దతును కోరారని సాంబశివరావు చెప్పారు. అయితే, పొత్తుల సందర్భంగా నాలుగు ఐదు స్థానాలు ఇస్తామని చెప్పి, తర్వాత కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారని ఆయన వివరించారు. ఒక దశలో మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినా, సీపీఐ తిరస్కరించిందని, సీట్లే కావాలని కోరిందని ఆయన తెలిపారు. తమకు సీట్లు ఇవ్వలేదని, సొంతంగా పోటీ చేద్దామని నిర్ణయించుకున్న సమయంలో, క్యాడర్ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. శాసనసభల్లో తాము లేని లోటు ఇతర పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో అర్థమవుతుందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి మినహా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కమ్యూనిస్టుల మద్దతు వల్లే అధికారంలోకి వచ్చామని కృతజ్ఞతలు చెప్పే అలవాటు లేదని ఆయన విమర్శించారు.

కూనంనేని క్రాస్ ఫైర్ పూర్తి ఇంటర్వ్యూ దిగువన చూడండి…

Follow Us