భాగ్యనగర వాసులకు శుభవార్త..నగరంలో మెట్రో పరుగులు !
మే 11 నుంచి హైదరాబాద్ లో పలు ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, క్యాబ్లు, ఆటోలు ..
కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని ఒక్కసారిగా రెడ్ సిగ్నల్ వేసి ఆపేసింది. దీంతో దాదాపు గత 50 రోజులుగా ప్రజలు, వ్యవస్థలు అన్ని స్తంభించిపోయాయి. విస్తరిస్తున్న వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే, కేంద్రం ప్రకటించిన మూడో దశ లాక్డౌన్ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇస్తూ..కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 11 నుంచి హైదరాబాద్ లో పలు ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, క్యాబ్లు, ఆటోలు ప్రారంభిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే, నగరంలో మాత్రం వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దీంతో రెడ్జోన్లో ఉన్న నగరంలో ఇప్పటికిప్పుడు ప్రజారవాణాకు అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం మే 17 వరకు లాక్డౌన్ పాటించాలని నిర్ణయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మే 29 వరకు పొడిగించింది. మే 15 తర్వాత మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నా, నగరంలో కేసుల తీవ్రత దృ ష్ట్యా ప్రజారవాణా వ్యవస్థను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ కేంద్రం తీసుకునే నిర్ణయం ఆధారంగా మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.