కరోనా అలర్ట్ః బయటకు వెళ్తున్నారా..? అయితే, ఇది మీ కోసమే..
తెలంగాణలోనూ కోవిడ్ భూతం జడలు విప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారయంత్రాంగం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది...
కరోనా పట్టు వదలటం లేదు. రోజురోజుకూ విభంభిస్తూ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలోనూ కోవిడ్ భూతం జడలు విప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారయంత్రాంగం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మహమ్మారి వైరస్ని అడ్డుకోవాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం కాబట్టి, ప్రజలంతా తమకు సహకరించాలని హైదరాబాద్ సీపీ విజ్క్షప్తి చేశారు. కాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు.
24 గంట పాటు కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 3,500 పీటీ కేసులు, నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సంస్థలపై 182 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 2,724 వాహనాలను సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు 2,724 వాహనాలను సీజ్ చేశామన్నారు.
మరోవైపు నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లపైనే దాడులు జరుగుతున్నాయని, అది దారుణమన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి. డ్యూటీలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 1897-2018 యాక్ట్ ప్రకారం చట్టపరంగా నిందితుల పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనవసరంగా వాహనాలపై బయట తిరుగుతున్న వాళ్ళను జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గట్టి హెచ్చరికలు చేశారు. 99 శాతం మంది ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, 1% మాత్రమే ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్ళవల్ల ఇన్ని రోజుల కష్టం వృథా అవుతుందని హెచ్చరించారు. పిల్లలు బయటికు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని కోరారు. లాక్ డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని స్పష్టం చేశారు.