RBI: లోన్ కట్టకపోవడంతో బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా? ఇకపై అలా కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..
ఖాతాదారుడు రుణం చెల్లించలేక చేతులెత్తేసినప్పుడు ఆస్తుల తాకట్టుకు సంబంధించి బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలకు లోబడి బ్యాంకులు ఖాతాదారుడి ఆస్తులను వేలం నిర్వహించి విక్రయించాల్సి ఉంటుంది. అలాగే స్వాధీనం చేసుకునే సమయంలో పలు నిబంధనలు పాటించాలి.

ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఆర్ధిక పరిస్థితులు మరింత దిగజారినప్పుడు లోన్లు చెల్లించలేక డీఫాల్టర్గా మిగిలిపోతుంటారు. అయితే రుణం తీసుకునేముందు బ్యాంకులు ఖాతాదారుడి ఆస్తులను తాకట్టుగా పెట్టుకుంటుంది రుణం తిరిగి చెల్లించకపోతే తాకట్టుగా పెట్టిన ఇల్లు లేదా ఇతర ఆస్తిని బ్యాంకులు జప్తు చేసుకుంటాయి. వాటిని వేలంలో విక్రయించగా వచ్చిన సొమ్మును తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో ఏమి చేయాలో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అయితే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 1, 2026 నుండి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. రుణ చెల్లింపులో డిఫాల్ట్ కారణంగా బ్యాంకులకు లభించే అటువంటి నిరర్థక ఆస్తుల విలువను నిర్ణయించడం, వాటి విక్రయాలపై కొత్త గైడ్ లైన్స్ ఆర్బీఐ జారీ చేసింది.
బ్యాంకులు స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను గరిష్టంగా 7 సంవత్సరాల వ్యవధిలోగా విక్రయించాల్స ఉంటుందని ఆర్బిఐ డెడ్ లైన్ విధించింది. బ్యాంకులు తమ అంతర్గత విధానాలకు లోబడి ఈ ఆస్తులను దీర్ఘకాలం పాటు ఉంచుకోకుండా వీలైనంత త్వరగా విక్రయించాలని తమ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆస్తులను విక్రయించడానికి బ్యాంకులు వాటిని బహిరంగంగా వేలం వేయాలి. దీనివల్ల బ్యాంకులు ఆస్తులను రహస్యంగా లేదా స్వప్రయోజనాల కోసం విక్రయించకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే వాటి ఖచ్చితమైన మార్కెట్ విలువను పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక స్వాధీనం చేసుకున్న ఆస్తిని బ్యాంకులు తిరిగి అమ్మకూడదు. లోన్ చెల్లించని వ్యక్తి ఆస్తిని తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉండదు. రుణ గ్రహీత మళ్లీ తన ఆస్తిని కొనడానికి అనుమతించమని ఆర్బీఐ స్పష్టం చేసింది. జప్తు చేసిన ఆస్తుల విలువను నిర్ధారించడానికి ఆర్బీఐ నిర్దిష్ట ప్రమాణాలను కూడా రూపొందించింది. రుణ పరిష్కార మొత్తం నికర పుస్తక విలువ (నెట్ బుక్ వాల్యూ), బ్యాంకు వెలుపల ఉన్న ఇద్దరు బాహ్య వాల్యూయర్లు నిర్ధారించిన అత్యవసర అమ్మకపు విలువ (డిస్ట్రెస్ సేల్ వాల్యూ)లలో ఏది తక్కువైతే దానిని ఆస్తి విలువగా నమోదు చేయాలని పేర్కొంది.
బ్యాంకులు తమ ఆస్తుల విలువను అతిగా చూపకుండా నిరోధించడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాలను బ్యాంకులన్నీ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించకపోతే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. బ్యాంకుల ద్వారా మొండి బకాయిల నిర్వహణలో మరింత స్పష్టత, పారదర్శకత తీసుకురావడానికి ఆర్బీఐ ఈ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల వల్ల ఆస్తులు బ్యాంకులలో ఎక్కువ కాలం నిలిచిపోకుండా, వాటిని పారదర్శకంగా విక్రయించడానికి వీలవుతుందని చెప్పవచ్చు.
