దేశంలో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. ఆంక్షల అమలుతో సినీ రంగానికి కొత్త చిక్కులు..!

కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది.. ప్రస్తుతం మనం కత్తుల వంతెన మీద కోలాటం చేస్తున్నాం.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది.

దేశంలో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. ఆంక్షల అమలుతో సినీ రంగానికి కొత్త చిక్కులు..!
Film Industry Worried As Corona Restrictions Imposed
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 10, 2021 | 12:50 PM

film industry worried of Covid-19: కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది.. ప్రస్తుతం మనం కత్తుల వంతెన మీద కోలాటం చేస్తున్నాం.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది. సెకండ్‌ వేవ్‌ ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరకడం లేదు. వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాప్తిచెందుతున్న కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలు, నైట్‌ కర్ఫ్యూ విధించాయి.. మరీ తీవ్రంగా ఉన్న నగరాలలలో లాక్‌డౌన్‌ కూడా అమలవుతోంది..

ముంబాయిలో అయితే టీవీ సీరియల్స్‌ షూటింగ్‌పై నిషేధం విధించారు. సినిమా షూటింగ్‌లను కూడా నిబంధనల మేరకు అనుమతి ఇస్తున్నారు. నిరుడు ఇదే సమయానికి కరోనా చాలా తీవ్రంగా ఉండింది.. మళ్లీ ఇప్పుడు అదే సన్నివేశం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి.. సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.. అక్టోబర్‌ తర్వాత కరోనా కాసింత నెమ్మదించడంతో థియేటర్లు తెరచుకున్నాయి.. తొలుత 50 శాతం కెపాసిటీతో తెరుచుకున్న సినిమా హాళ్లు తర్వాత యథాస్థితికి వచ్చాయి. థియేటర్ల దగ్గర కళ పెరిగింది. మొదట్లో కొంచెం బెరుకు కనబర్చిన ప్రేక్షకులు తర్వాత తర్వాత థియేటర్ల దారి పట్టారు.. సినిమా హాల్స్‌లో సందడి పెరిగింది.

అయితే ఇప్పుడు మళ్లీ కరోనా కోరలు చాస్తుండటంతో పరిస్థితి మొదటికి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది ఇండస్ట్రీకి! ఇప్పటికే మహారాష్ట్రలో థియేటర్లు బందయ్యాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న హిందీ సినిమాలు వాయిదా పడుతున్నాయి. రిస్క్‌ ఎందుకన్న ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు. కరోనా తగ్గిన తర్వాతే విడుదల చేయవచ్చని కొందరు మానసికంగా సిద్ధపడిపోయారు. ఇక కర్నాటకతో పాటు కొన్ని రాష్ట్రాలు మళ్లీ 50 శాతం సీటింగ్‌ కెపాసిటీని అమలు చేస్తున్నాయి. కరోనా ఎక్కువగా ఉన్న చోట్ల థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గారు. కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సినిమా రిలీజ్‌ అయితే ఆ సందడే వేరేగా ఉంటుంది.. మొన్న విడుదలైన యువరత్న సినిమాకు అభిమానుల కోలాహలం ఎలా ఉండిందో మనం చూశాం.. ఆ సినిమానే విడుదలయ్యి వారం రోజులు గడవలేదు అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ తగ్గింది. ధనుష్‌ సినిమా కర్ణన్‌కు కూడా కష్టాలు తప్పడం లేదు. సినిమా హిట్‌ టాక్‌ వచ్చినా థియేటర్లలో సగం మంది ప్రేక్షకులకే అనుమతి ఉండటంతో కలెక్షన్లు తగ్గాయి.

తెలుగు సినీ పరిశ్రమకు కూడా దడ మొదలయ్యింది. కరోనా కారణంగానే లవ్‌స్టోరీ సినిమా విడుదల వాయిదా పడింది. పవన్‌కల్యాణ్‌ నటించిన వకీల్‌సాబ్‌ అయితే హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్నది. రాబోయే రోజులు ఇలాగే ఉంటాయన్న నమ్మకం లేదు. లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే చెప్పినప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో సినిమా హాళ్లు ఇప్పుడున్నట్టుగానే నడుస్తాయా అన్న అనుమానం మొదలయ్యింది. హైకోర్టు కూడా థియేటర్ల విషయంలో సీరియస్సయ్యింది. బోలెడంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలను ఇప్పుడు రిలీజ్‌ చేయాలా వద్దా అన్న సంశయానికి నిర్మాతలు వచ్చారు. మొన్నటి వరకు షూటింగ్‌లు జోరుగా సాగాయి.. కరోనా వైరస్‌ వ్యాప్తిని చూసిన తర్వాత పునరాలోచనలో పడ్డారు నిర్మాతలు. లాక్‌డౌన్‌ నిబంధన తొలగిపోయిన తర్వాత రోజుకు వందకు పైగా షూటింగ్‌లు జరిగాయి.. ఇప్పుడా పరిస్థితి లేదు. షూటింగ్‌ స్పాట్‌కు రావడానికి టెక్నిషియన్లు భయపడుతున్నారు. మేకప్‌మ్యాన్‌లు కూడా దొరకడం లేదు. సినిమా అంటేనే ఖర్చుతో కూడిన పని! అలాంటిది సిబ్బందికి టెస్టులు చేయించడం, పదే పదే శానిటైజేషన్ చేయాల్సి రావడం, మాస్కులు గట్రాలు సప్లయి చేయడం వంటి వాటివల్ల నిర్మాతలకు అదనపు భారం పడుతోంది. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న రామ్‌సేతు సినిమా షూటింగ్‌ కోసమని వచ్చిన వంద మంది జూనియర్‌ ఆర్టిస్టులకు కరోనా పరీక్షలను నిర్వహిస్తే అందులో 45 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. తెలుగు సినిమాలకు కూడా ఈ బెడద ఉంది.

బాలీవుడ్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. రానా నటించిన అరణ్య సినిమా ఇక్కడైతే విడుదలయ్యింది కానీ ఆ సినిమా హిందీ వెర్షన్‌ హాథీ మేరే సాధీ మాత్రం ఇంకా విడుదల కాలేదు. నిర్మాణ సంస్థ ఈరోస్‌ సినిమా విడుదలను నిరవధికంగా వాయిదా వేసుకుంది. అమితాబ్‌బచ్చన్‌ నటించిన చెహరే సినిమా నిజానికి ఈ శుక్రవారం విడుదల కావాలి. కాని కరోనా ఆ విడుదలను వాయిదా వేయించింది. ఇప్పటికే పలు వాయిదాలకు నోచుకున్న అక్షయ్‌ కుమార్‌ సూర్యవంశి సినిమాకు కూడా ఇదే పరిస్థితి. ఈ నెల 30న విడుదల చేద్దామనుకున్న ఆ సినిమా కూడా వాయిదా పడింది. బబ్లీ ఔర్‌ బంటీ 2 వంటి సినిమాలతో పాటు అనేకం వాయిదా పడ్డాయి.

లాక్‌డౌన్‌ అయితే ఉండదని చెప్పిన ప్రభుత్వం ఆంక్షల విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడు సినిమా హాళ్ల కెపాసిటీ 50 శాతానికి తగ్గించినా పరిశ్రమ బాగా నష్టపోతుంది. 50 శాతం కెపాసిటీలోనూ కొన్ని సినిమాలు కలెక్షన్లను కురిపించాయి. నిర్మాతలను సేఫ్‌జోన్‌లోకి తీసుకెళ్లాయి.. వకీల్‌సాబ్‌ కూడా కనకవర్షం కురిపిస్తున్నది. అయితే వేగంగా పెరుగుతున్న కరోనా ఈ ఆనందాన్ని కొనసాగిస్తుందా అన్నదే సందేహం. థియేటర్‌ అన్నాక వందలకొద్దీ ప్రేక్షకులు వస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది.. ఆ లెక్కన కరోనా సోకిన అయిదారుగురు వ్యక్తులు థియేటర్లకు వచ్చినా ఈజీగా అది వందమందికి అంటుకునే ప్రమాదం ఉంది. ఆ వంద మంది వెయ్యి మందికి అంటించే ముప్పు ఉంటుంది.

ఒకవేళ థియేటర్లలో ఆంక్షలు పెడితే మాత్రం చాలా మంది నష్టపోతారు. పెద్ద సినిమా ప్రొడ్యుసర్లకు అయితే మరింత కష్టం. బయ్యర్ల దగ్గర నుంచి నిర్మాతలపై వరకు దీని ప్రభావం ఉంటుంది. కరోనా సెకండ్‌వేవ్‌ కమ్ముస్తుండటంతో ప్రజల్లో ఇప్పుడు భయం మొదలయ్యింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో సినిమారంగంపై పెను ప్రభావమే పడింది. మహారాష్ట్రలో థియేటర్లను పూర్తిగా మూసేశారు. కర్నాటక, తమిళనాడులలో 50 శాతం సీటింగ్‌కే పరిమితం చేశారు. మన తెలుగు సినిమాలు కర్నాటక, తమిళనాడులలో కూడా విడుదలవుతాయి.. ఢిల్లీ, ముంబాయిలలో కూడా రిలీజ్‌ అవుతాయి. ఇప్పుడు అక్కడి నిబంధనల కారణంగా కలెక్షన్లు తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రానా నటించిన విరాటపర్వం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వచ్చే నెలలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య, వెంకటేశ్‌ నటించిన నారప్పలు విడుదల కానున్నాయి. ఈమధ్య కాలంలో కరోనా తీవ్రత మరింత పెరిగితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. 50 శాతం కెపాసిటీ నిర్ణయం తీసుకుంటే మాత్రం పెద్ద సినిమాలకు కష్టమే! ఇప్పటికే జయలలిత బయోపిక్‌ తలైవ్‌ విడుదల వాయిదా పడింది.

Read Also…  West Bengal Election 2021 Phase 4 LIVE: బెంగాల్‌ కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌.. సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి