కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్…సీఎంలా వ్యవహరిస్తున్నారా ?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నట్టు కనబడుతోందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నట్టు కనబడుతోందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ఆయన రద్దు చేయడమే గాక.. నగరంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించేందుకు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతూ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశానికి హాజరు కాకపోవచ్ఛు. ఆయనకు ఇవాళ కరోనా టెస్ట్ నిర్వహించనున్నారు. ఢిల్లీవాసులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలను రిజర్వ్ చేయాలని, కరోనా లక్షణాలు ఉన్నవారినే టెస్ట్ చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలను అనిల్ బైజాల్ నిన్న రద్దు చేశారు. ఎసింప్టోమాటిక్ కేసులతో బాటు వైరస్ రోగుల హైరిస్క్ కాంటాక్టులను కూడా టెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.
ఢిల్లీలో సామూహిక కరోనా వ్యాప్తి చెందిందా అన్న అంశంపై చర్చించేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ అథారిటీకి అనిల్ బైజాల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా… ఆయన వ్యవహరిస్తున్న తీరును అధికార ఆప్ పార్టీ తప్పు పడుతోంది. కేంద్రంలోని పాలక బీజేపీ సూచనలపైనే ఆయన పని చేస్తున్నారని ఆరోపిస్తోంది.