AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. మద్యం పిచ్చి..! కిక్కు కోసం కరోనా వార్డ్ నుంచి ఎస్కేప్..ఎక్కడో కాదు

మద్యం కోసం ఓ వ్యక్తి కరోనా వార్డు నుంచి తప్పించుకుని పారిపోయాడు. నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. అంతకు ముందే తన స్నేహితుడికి ఫోన్ చేసి తనకు మద్యం కావాలని..

వార్నీ.. మద్యం పిచ్చి..!  కిక్కు కోసం కరోనా వార్డ్ నుంచి ఎస్కేప్..ఎక్కడో కాదు
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2020 | 4:02 PM

Share

మద్యం కోసం ఓ వ్యక్తి కరోనా వార్డు నుంచి తప్పించుకుని పారిపోయాడు. బుధవారం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది, అధికారులు తెలిపిన వివరాల మేరకు..

జూన్ 19న 30 ఏళ్ల వ్యక్తి… తన మరో 19 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. దీంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనల మేరకు పోలీసులు ముందస్తుగానే నిందితుడికి కోవిడ్-19 పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో నిందితుడిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.

ఇదిలా ఉండగా, బుధవారం అతడికి చేతికి గాయం కావడంతో వేరే వార్డుకు తరలించి చికిత్స చేసేందుకు నర్సు సిద్ధమవుతోంది. ఇదే అదునుగా భావించిన నిందితుడు..అక్కడున్న నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. అంతకు ముందే తన స్నేహితుడికి ఫోన్ చేసి తనకు మద్యం కావాలని కోరాడు. నిందితుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు స్నేహితుడికి తెలిసినప్పటికీ..మద్యం కోసం పుష్పంజలి థియేటర్ వద్దకు చేరుకున్నాడు.

ఈలోగా ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు అతన్ని వెంబడించారు.  నిందితుడితో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మద్యం కోసమే నిందితుడు ఆస్పత్రి నుంచి పరారీ అయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడితో పాటు అతని స్నేహితుడిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.