వరంగల్ నిట్లో ఆ ముగ్గురికీ కరోనా !
తెలంగాణలో కరోనా బాధితులు లేరు... అని ఓవైపు ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా...మరోవైపు తాజాగా వరంగల్ ఎన్ఐటీలో ముగ్గురు విద్యార్థులకు కరోన లక్షణాలు ఉన్నట్లుగా...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. తాజాగా ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అటు విశాఖలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా కరోనా లక్షణాలతో మరో ఇద్దరు ఆస్పత్రిలో చేరటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తితోపాటు.. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తి రోగ లక్షణాలు ఉంటంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా బాధితులు లేరు అని ఓవైపు ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా…మరోవైపు తాజాగా ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఆయనకు కరోనా నిర్ధారితం కాకపోగా..అలాంటి లక్షణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వరంగల్లోని నిట్లో ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వరంగల్ ఎన్ఐటీలో ముగ్గురు విద్యార్థులకు కరోన లక్షణాలు ఉన్నాయని ఇంకో ప్రచారం జరుగుతుండటంతో…ఏది నిజం ఏది అబద్దం అనే డైలమా కొనసాగుతోంది.
నిట్ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం కర్నూలుకు చెందిన విద్యార్థికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చిన ఆ విద్యార్థి తీవ్రమైన దగ్గు జలుబుతో బాధపడుతుండటంతో స్థానికంగా ఓ ప్రైవేటు హస్పిటల్ కి తరలించామని అనంతరం జిల్లా వైద్యాధికారి సూచనల మేరకు వరంగల్ ఎంజీఎం ఐసోలేషన్ వార్డుకు తరలించామని నిట్ రిజిస్ట్రార్ వెల్లడించారు. విద్యార్థికి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న ఆయన నిట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని ప్రకటించారు.
మరోవైపు నిట్ క్యాంపస్లోనే ఉన్న మరో ముగ్గురికి వైరస్ సోకిందనే ప్రచారం జరుగుతోంది. కేరళకు చెందిన రాహుల్ మీనన్ ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన రిషిత్ పాండే కర్నూలుకు చెందిన ముష్రఫ్ జాఫర్ కరోనా బాధితులుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ ఏంజిఎంలో ఇద్దరికి చికిత్స అందుతుండగా ఒకరిని హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా…కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోన వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటుందన్న విషయాలపై ప్రభుత్వం హై కోర్టుకు నివేదిక రూపంలో సమర్పించింది. ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ప్రారంభిస్తామని కోర్టుకు తెలిపారు అధికారులు.