ఆ పాట పాడుతుంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది.. ఆయాసంతో పోరాడుతూనే.. సరిగ్గా అదే సమయంలో ఏం జరిగిందంటే..
ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూశారు. మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు అప్సరా వైద్యుల సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జానకమ్మ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు ఆరు దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచంలో 50 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించారు సింగర్ జానకి. చిన్ననాటి నుంచే సంగీతంపై అసాధారణమైన ఆసక్తి కనబరిచిన జానకి మూడేళ్ల వయసులోనే వేదికలపై పాటలు పాడడం ప్రారంభించారు. సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ పొందుతూ తన గాన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. అయితే 1960ల నుండే తీవ్రమైన శ్వాస సమస్యలతో పోరాడుతూనే వేలాది పాటలు పాడినట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది ఆమె అలుపెరగని కృషికి, అంకితభావానికి నిదర్శనం. నాలుగేళ్ళకే ఒక పాట వినగానే స్వరాలు రాయగల జ్ఞానం తనలో ఉన్నాయని ఆమె తెలిపారు. “పదేళ్ళ వయసులో మా అక్కయ్యలతో పాటు బలవంతంగా మా అమ్మ పైడి స్వామి గారి వద్ద క్లాసికల్ నేర్చుకోమని పంపిందని వివరించారు. పైడి స్వామి గారు, జానకి సామర్థ్యాన్ని గుర్తించి, “సరిగమలు నేర్పడం అనవసరం, భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు” అని చెప్పి, నేరుగా నగుమోము కీర్తనతోనే పాఠాలు ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. కేవలం పది నెలలు మాత్రమే ఆయన వద్ద నేర్చుకున్నానని, ఆయన మరణానంతరం ఇంట్లో ఎలాంటి సాధన చేయలేదని ఆమె వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి రెండెడ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చిన తర్వాత, అందులోని ఏడుపు పాటలను తానూ ఏడ్చి పాడేదానినని, పక్కింటి వారు తనను ఎత్తుకుపోయి పాడించుకునేవారు” అని ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఎస్. జానకి గారు 17 వేలకు పైగా పాటలను, 17 భాషల్లో పాడి రికార్డు సృష్టించారు. మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, ఒరియా వంటి అనేక భాషల్లో అద్భుతమైన పాటలు పాడిన ఆమె, అన్ని బాణీల పాటలను, కర్ణాటక సంగీతం నుంచి జానపదాల వరకు, అవలీలగా ఆలపించారు. ఆమె పాడేటప్పుడు ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్లు అనిపిస్తుందని, కానీ ఆమె అన్ని రకాల పాటలను అద్భుతంగా పాడటం ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా, తన గొంతులో స్వతహాగానే సంగతులు పలుకుతాయని, కష్టపడి పలికించాల్సిన అవసరం లేదని అన్నారు. డైమండ్ దాని గులాబీ బుగ్గనిదే వంటి పాటలకు ఒకరకమైన మోడ్యులేషన్, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే వంటి పాటలకు మరొక రకమైన మోడ్యులేషన్, అలాగే బాల కనక మయ చేల సుజన పరిపాల వంటి శాస్త్రీయ కీర్తనలకు తగిన పద్ధతిలో పాడతానని, కానీ తన గొంతు ఒక్కటేనని వివరించారు. తోడి, ఆభోగి రాగాలను కలిపి పాడిన ఒక కన్నడ పాట, అలాగే శివ శివయన్నద నాళిగేయకే వంటి వేగవంతమైన స్వరాలు ఉన్న పాటలు తనకు కష్టమనిపించాయని పేర్కొన్నారు.
ఈ అసాధారణ ప్రస్థానంలో ఎవరికీ తెలియని ఓ తీవ్రమైన ఆరోగ్య సవాలును జానకి గారు ఎదుర్కొన్నారు. “నాకు 1960-62 నుంచే బ్రీతింగ్ ప్రాబ్లమ్ (ఆయాసం) ఉంది. అంటే 46-47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. టకాటిన్ ఇంజెక్షన్లు నరాల్లోకి” అని ఆమె వెల్లడించారు. ఈ తీవ్రమైన ఆయాసంతో బాధపడుతూనే ఆమె తమ కెరీర్లో ఎన్నో గొప్ప పాటలను పాడారని తెలిపారు. ఎల్. విజయలక్ష్మి నృత్యం చేసిన పూజా ఫలంలో “శివ దీక్షా పరురాలనౌరా” అనే పాటను ఆయాసంతోనే గుండె బిగించుకుని పాడినట్లు, కానీ బయటికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు వివరించారు. ఈ వాస్తవం ఆమె అంకితభావానికి, వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధతకు, అద్భుతమైన సంకల్పానికి నిదర్శనం.
