తాజ్మహల్ మూసేయాల్సిందే.. కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ..!
తాజ్ మహల్.. ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న ఈ ప్రాచీన కట్టడం గురించి తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ తాజ్ను ఇప్పుడు మూసేయాలంటూ ఆగ్రా మేయర్ నవీన్ జైన్ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశీయులే కాకుండా.. అనేక మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వారు.. దాదాపుగా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్లరు. ఇటీవల భారత్ టూర్కు వచ్చిన […]

తాజ్ మహల్.. ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న ఈ ప్రాచీన కట్టడం గురించి తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ తాజ్ను ఇప్పుడు మూసేయాలంటూ ఆగ్రా మేయర్ నవీన్ జైన్ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశీయులే కాకుండా.. అనేక మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వారు.. దాదాపుగా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్లరు. ఇటీవల భారత్ టూర్కు వచ్చిన అగ్రరాజ్యాధిపతి ట్రంప్ కూడా.. తాజ్మహల్ను సందర్శించిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.
తాజ్మహల్ను చూసేందుకు నిత్యం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రాకు వస్తున్నారని.. ఒకవేళ వారిలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే.. నగరంలో వ్యాపించే అవకాశాలున్నాయని ఆగ్రా మేయర్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ.. తాజ్మహల్తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని.. ఇక్కడికి పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు ఇప్పటికే యూపీలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా.. తాజ్ను సందర్శించేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించగా.. వారిలో 708 మందిని హోంఐసోలేషన్కు తరలించారని అధికారులు తెలిపారు. కాగా.. ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలను గుర్తించిన అధికారులు.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆగ్రా వైద్యాధికారులు చెప్పారు.



