Hyderabad: ఎయిర్పోర్ట్ రేంజ్లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్.. చూస్తే అదరహో అనాల్సిందే..
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. కొత్త భవనం నిర్మించడంతో పాటు ప్రదేశ ద్వారం మార్చారు. ఇక దివ్యాంగుల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఏర్పాాటు చేశారు. అలాగే త్రాగునీటి సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చారు. దీంతో హైటెక్ హంగులతో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంది.

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కొత్త రూపులు దిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం “అమృత్ స్టేషన్ పథకం” కింద దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను కొత్తగా ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కూడా ఎంపిక చేయగా.. గత కొంతకాలంగా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఇక్కడ ఉండటంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతుండగా.. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు హైటెక్ సిటీ స్టేషన్ పనులు కూడా పూర్తవ్వగా.. దీని వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. హైటెక్ సిటీలో అనేక ఐటీ కంపెనీలో కొలువుదీరడంతో పాటు ఇక్కడ అనేక భవన నిర్మాణాలు కూడా జరుగుతన్నాయి. దీంతో రోజూ ఎంతోమంది రోజువారీ కార్మికులు వస్తూ ఉంటారు. వీరిని పరిగణలోకి తీసుకుని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు.
ఏయే మార్పులు చేశారంటే..?
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఒక సబర్బన్ స్టేషన్గా ఉంది. లింగంపల్లి–సికింద్రాబాద్ రైల్వే మార్గంలో ఇది కీలకమైన స్టేషన్గా కొనసాగుతోంది. హైదరాబాద్ నగర పశ్చిమ ప్రాంతంతో పాటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ స్టేషన్ ప్రధాన రవాణా కేంద్రంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ స్టేషన్లలో సబర్బన్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. ప్రతిరోజూ సికింద్రాబాద్, హైదరాబాద్, ఉమ్దానగర్, ఫలక్నుమా, మేడ్చల్, ఘట్కేసర్ లాంటి ప్రాంతాలకు ఈ స్టేషన్ నుంచి సుమారు 62 రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. రోజుకు సుమారు 3 వేల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళుతున్నారు. ఐటీ కారిడార్ పరిధిలో ఉండటంతో ఈ స్టేషన్ను అభివృద్ది చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో అమృత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది పనులు చేపట్టింది. ప్రస్తతుం డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పించారు.
కొత్త సౌకర్యాలు ఇవే..
స్టేషన్ ఎంట్రన్స్ కొత్తగా నిర్మించారు. అలాగే ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించారు. ఇక ఇప్పటికే 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండగా.. దీనికి అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇక ప్రస్తుతం 2 లిఫ్టులు ఉండగా.. ఇప్పుడు మరో 2 కొత్త లిఫ్టులు ఏర్పాటు చేశారు. అలాగే 2 ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఫ్లాట్ఫామ్స్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. అదనపు షెడ్లు, కొత్త శౌచాలయం, వెయిటింగ్ హాల్,, ఫసాడ్ లైటింగ్, ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యే సూచిక బోర్డులు వంటివి ఏర్పాటు చేశారు. డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపర్చారు. అలాగే దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ఆధునిక శౌచాలయం ఏర్పాటు చేశారు.

Hitech City Station
