తెలంగాణలో గ్రీన్జోన్లోకి మరిన్నిజిల్లాలు..మిగిలినవి మూడే !
తెలంగాణలో గ్రీన్జోన్ ఉన్నజిల్లాల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
తెలంగాణలో దాదాపు 80 శాతం జిల్లాలు గ్రీన్ జోన్లో వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాల్లో కేసులు లేవు. కనుక వాటిని కూడా గ్రీన్ జోన్ లుగా ప్రకటించాలని కేంద్రాన్నిప్రభుత్వం కోరింది. అలాగే సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించాలని కోరింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి, వీటిలో కూడా రూరల్ లో కేసులు లేవని ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వివరాలు పరిశీలించగా…
ప్రస్తుతం రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉండగా.. మరో 14 జిల్లాలు త్వరలోనే గ్రీన్ జోన్లో చేరనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సోమవారం నాటికి మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, జగిత్యాల, ఆసిఫాబాద్, జనగామ జిల్లాలు గ్రీన్ జోన్లోకి మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు జిల్లాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. వీటిలో సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఈటల తెలిపారు. దీంతో ఈ మూడు జిల్లాలు ఆరెంజ్ జోన్లోకి మారతాయన్నారు. అదే జరిగితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లో కొనసాగనున్నాయని తెలిపారు.
ఇకపోతే, తెలంగాణలో శుక్రవారం కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1132 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లైంది. కాగా రాష్ట్రంలో కరోనా సోకి చికిత్సతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 720గా ఉంది. నిన్న ఒక్కరోజే 34 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 376 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 29గా ఉంది.