కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వైద్య విభాగాన్ని పటిష్టం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో వెంటిలేటర్ల సమస్య ఉన్న సంగతి తెలిసిందే. 130 కోట్ల జనాభాకు కేవలం లక్షలోపే వెంటిలేటర్లు ఉన్నాయని తేలడం కలకలం రేపింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన 50వేల వెంటిలేటర్లను సిద్ధం చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పీఎం కేర్స్ ఫండ్ నుంచి 50వేల వెంటిలేటర్స్ను రెడీ చేయించారు. వీటిని పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. అత్యధికంగా రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( బీఈఎల్) 30 వేల వెంటిలేటర్స్ను రెడీ చేయగా.. మిగతా 20 వేల వెంటిలేటర్స్ను ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేశాయి. వీటిలో ఆగ్వా హెల్త్ కేర్ 10వేలు, ఎఎమ్టిజెడ్ బేసిక్ (5650), ఎఎమ్టిజెడ్ హై ఎండ్ (4000), అలైడ్ మెడికల్ (350) కంపెనీల ఆధ్వర్యంలో రెడీ అయ్యాయి. ఈ వెంటిలేటర్లను ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అందించనుంది.