TS ECET 2025 Counseling: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. రేపట్నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలోకి నేరుగా ప్రవేశించేందుకు రేపట్నుంచి (జూన్ 14) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రవేశాల కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి షెడ్యూల్ ఖరారు చేశారు..

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ ఈసెట్ 2025 కౌన్సెలింట్ షెడ్యూల్ వచ్చేసింది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలోకి నేరుగా ప్రవేశించేందుకు రేపట్నుంచి (జూన్ 14) ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రవేశాల కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి షెడ్యూల్ ఖరారు చేశారు. జూన్ 11న రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈసెట్ కౌన్సెలింగ్ మొత్తం రెండు విడతల్లో జరగనుంది.
తొలి విడత కౌన్సెలింగ్లో భాగంగా జూన్ 14 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుంది. అనంతరం జూన్ 17 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. జూన్ 17 నుంచి 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. జూన్ 25వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడతలో సీట్లు పొందిన వారంతా జూన్ 29 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఇక జులై 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. జూలై 11 నుంచి 13వరకు దరఖాస్తులు స్వీకరణ, జూలై 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూలై 15 వరకు వెబ్ ఆప్షన్లు, జూలై 18న సీట్ల కేటాయింపు, జూలై 20 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన వారు జూలై 22 వరకు కాలేజీల్లో రిపోర్ట్చేయాలి. జూలై 23లోగా సీట్లు కేటాయించిన ఆయా కాలేజీల్లో జాయినింగ్ కావాల్సి ఉంటుంది. జూలై 22న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం జూలై 29లోపు స్పాట్ అడ్మిషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.