APPSC Group 1 Exam: ‘ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’ సర్కార్కు అభ్యర్థులు విజ్ఞప్తి
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 91,463 మంది పరీక్ష రాశారు. అయితే ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మెయిన్స్కు అర్హత సాధించారు..

అమరావతి, ఆగస్టు 8: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 91,463 మంది పరీక్ష రాశారు. అయితే ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మెయిన్స్కు అర్హత సాధించారు. మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఆ తర్వాత కేవలం 24 రోజుల్లోనే కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
అయితే తాజాగా ప్రిలిమ్స్ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్కు అనుమతి ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డీవైఈఓ, గ్రూప్-2 మెయిన్ పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలోనే ఎంపిక చేశారని, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని గుర్తుచేస్తున్నారు. దీనిపై గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదనీ, కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వేచి చూడాల్సిందే.
మరోవైపు వచ్చే నెలలోనే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఒకవేళ సానుకూలం స్పందించి మెయిన్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తే.. పరీక్ష పన్నద్ధతకు సమయం కావాలంటూ అభ్యర్ధులు కోరుతారు. దీంతో మెయిన్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగే ఛాన్స్ లేనట్లే అవుతుంది.
అభ్యర్థులు లేవనెత్తుతోన్న అంశాలివే..
ప్రిలిమ్స్ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్కు అనుమతి ఇవ్వాలంటూ కోరడానికి సంబంధించి అభ్యర్థులు ఎదుర్కొన్న పలు సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ అభ్యర్థులు చెబుతోన్న అంశాలు ఏంటంటే..
* అభ్యర్థులు లేవనెత్తుతోన్న ప్రధాన అంశాల్లో సిలబస్కు సంబంధించి. మొదట్లో సిలబస్ మారుతుందని చెప్పడంతో చాలా మంది అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే చివర్లో మళ్లీ పాత సిలబస్తోనే పరీక్ష నిర్వహించడం వల్ల కూడా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* అభ్యర్థులు లేవనెత్తిన మరో అంశం అనువాద దోషాలు. పరీక్ష పత్రంలో ఇంగ్లిష్-తెలుగు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ స్పష్టంగా ఉన్నాయి. ఇవి తెలుగు మీడియం అభ్యర్థులకు ఇబ్బందిగా మారాయి.
* ఇక గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణంగా అభ్యర్థులు చెబుతున్నారు. కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు ఉన్న కారణంగా గ్రూప్ 1 సిలబస్ను రివిజన్ చేయలేకపోయారు.
* పేపర్-II ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ముఖ్యంగా జనరల్ ఆప్టిట్యూడ్ గతేడాదితో పోల్చితే చాలా కఠినంగా ఉంది అంటున్నారు. ఇది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి దీనిపై ఏపీపీఎస్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.




