10th తర్వాత బెస్ట్ కోర్సులు ఇవే.. మీ కెరీర్కు సరైన దారి ఎంచుకోండి
Best Courses After 10th: విద్యార్థి దశలో ప్రతీ విద్యార్థికి పదో తరగతి అనేది ఒక మైలురాయిగా ఉంటుంది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే ఉత్తమ కోర్సులు ఏవి? అనే సందేహం ఉంటుంది. ఇలాంటి సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Career options after 10th: పదో తరగతి విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైన దశ. ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగిశాయి. మరికొద్ది సమయంలో ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల మనసులో వచ్చే ప్రధాన ప్రశ్న… “ఆ తర్వాత ఏం చేయాలి?” అని. ఈ సమయంలో వేసవి సెలవులు సుమారు 45 రోజుల వరకు ఉంటాయి. ఈ గడువును సరైన విధంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి సెలవుల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఈ సెలవుల సమయంలో కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా ఉపయోగకరం. ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, గ్రాఫిక్ డిజైనింగ్, హార్డ్వేర్ వంటి ప్రాథమిక కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు తోడ్పడతాయి.
ఇంటర్ విద్యకు దారులు
- ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల కోర్సు పూర్తిచేస్తే భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయి.
- ఎంపీసీ: ఈ గ్రూప్ చదివితే ఇంజినీరింగ్ (బీటెక్), బీఆర్క్, జేఈఈ, ఎప్సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు అవకాశం ఉంటుంది. అలాగే బీఎస్సీ కోర్సులు కూడా చేయవచ్చు.
- బైపీసీ: ఈ గ్రూప్ ద్వారా నీట్ పరీక్ష రాసి మెడిసిన్, బీడీఎస్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, బీఫార్మసీ వంటి కోర్సుల్లో చేరవచ్చు. అలాగే బీఎస్సీ డిగ్రీ కూడా చేయొచ్చు.
- ఎంఈసీ: ఈ కోర్సు ద్వారా బీకాం, బీఏ, బీఎస్సీ (మ్యాథ్స్) వంటి డిగ్రీలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తరువాత సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయవచ్చు.
- సీఈసీ: ఈ గ్రూప్ చదివితే బీకాం లేదా బీఏ డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు. ఆ తర్వాత సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ వంటి కోర్సుల దిశగా వెళ్లవచ్చు. వృత్తి విద్య కోర్సులు
- ఇంటర్ స్థాయిలో దాదాపు 29 రకాల వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఎప్సెట్కు అర్హత పొందవచ్చు. మరికొన్ని కోర్సుల తర్వాత బ్రిడ్జ్ కోర్సు చేసి బీఎస్సీ చేయవచ్చు. అలాగే సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు కూడా అవకాశం ఉంటుంది.
గురుకుల విద్యా అవకాశాలు
టెన్త్ తర్వాత గురుకులాల్లో ఇంటర్ చదవడానికి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వంటి గ్రూపుల్లో చేరవచ్చు. ఇక్కడ విద్యతో పాటు ఉచిత భోజనం, వసతి కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. మంచి మార్కులు సాధిస్తే మాత్రమే ఈ అవకాశాలు పొందవచ్చు.
ఇతర ప్రవేశ పరీక్షలు, కోర్సులు
- ఐటీఐ కోర్సులు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, మెకానికల్, డ్రాఫ్టింగ్, రిఫ్రిజిరేషన్ వంటి అనేక కోర్సులు ఉన్నాయి.
- పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్, ఐటీ వంటి విభాగాల్లో డిప్లొమా కోర్సులు చేయవచ్చు.
- పారామెడికల్ కోర్సులు: ల్యాబ్ టెక్నాలజీ, ఆప్తాల్మిక్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఏఎన్ఎం వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్య సూచన
పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షలకు నిర్దిష్ట తేదీల్లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధంగా పదో తరగతి తర్వాత విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యం ఆధారంగా సరైన మార్గాన్ని ఎంచుకుంటే భవిష్యత్తు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు.
