చర్చలు విఫలం.. స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఈ టైమ్లో పెట్టుబడి పెట్టొచ్చా?
అమెరికా-ఇరాన్ చర్చలు నిష్ఫలం కావడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో ముడిచమురు ధరలు అనూహ్యంగా పెరిగి, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నా, పెద్ద పతనం ఉండకపోవచ్చు.

పాకిస్థాన్లో జరిగిన కీలక దౌత్య పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య 21 గంటల పాటు కొనసాగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగియడం, ప్రస్తుత ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికా తరఫున జేడీ వాన్స్ చివరి, ఉత్తమ ప్రతిపాదనను ముందుంచినప్పటికీ, ఇరాన్ తన వైఖరిలో మార్పు చూపకపోవడం వల్ల మరిన్ని చర్చలు అవసరమని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ప్రతిష్టంభన కొనసాగితే, రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కూడా అనిశ్చితిలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై వెంటనే కనిపించే అవకాశం ఉంది. సోమవారం మార్కెట్లు తెరుచుకున్న వెంటనే ముడి చమురు ధరలు గణనీయంగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రారంభ ట్రేడింగ్లోనే ధరలు కొన్ని డాలర్ల మేర పెరగడం, 24 నుంచి 48 గంటల్లో బ్యారెల్కు దాదాపు 100 డాలర్లకు చేరే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ నుంచి వస్తున్న విభిన్న సంకేతాలు మార్కెట్లో గందరగోళాన్ని పెంచుతూ, గ్లోబల్ అనిశ్చితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ విషయంలో పూర్తిగా ప్రతికూల దృశ్యం కనిపించకపోవచ్చు. హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, పెద్ద స్థాయిలో పతనం సంభవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా కొనుగోళ్లు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. మార్కెట్లో 3 నుంచి 5 శాతం వరకు దిద్దుబాటు వచ్చినా, దానిని ఒక అవకాశంగా చూడవచ్చని చెబుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపించనుంది. పెరుగుతున్న చమురు ధరల కారణంగా దిగుమతి వ్యయం పెరగడం వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. డాలర్కు డిమాండ్ పెరగడం రూపాయి బలహీనతకు దారితీస్తుంది. అదే సమయంలో, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగితే ఈ ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. రంగాల వారీగా చూస్తే, చమురు ధరల పెరుగుదల విమానయానం, పెయింట్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపనుండగా, ఇంధన ఉత్పత్తి సంస్థలకు ఇది లాభదాయకంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
