AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే..

తెలంగాణ రాష్ట్రంలో జీతాలు, పెన్షన్ల వ్యయం దశాబ్ద కాలంలో రూ.1500 కోట్ల నుండి రూ.6000 కోట్లకు పెరిగి నాలుగు రెట్లు అధికమైంది. ఈ భారీ పెరుగుదల రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర భారం మోపుతోంది, తద్వారా అభివృద్ధి పనులకు నిధుల లభ్యత తగ్గిపోతోంది. ఈ ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే..
Loan India
SN Pasha
|

Updated on: Feb 26, 2026 | 7:39 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ వ్యయం తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తాజా వివరాలు వెల్లడించడంతో ఆర్థిక పరిస్థితులపై దృష్టి కేంద్రీకృతమైంది. గత పది సంవత్సరాల్లో జీతాలు, పెన్షన్ బిల్లు నాలుగు రెట్లు పెరిగి నెలకు సుమారు రూ.6,000 కోట్లకు చేరుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో నెలవారీ జీతాలు, పెన్షన్లపై వ్యయం దాదాపు రూ.1,500 కోట్లుగా ఉండేది. తరువాత వరుస వేతన సవరణలు, ఫిట్‌మెంట్ పెంపులు కారణంగా ఈ ఖర్చు సుమారు 300 శాతం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో గణనీయ భాగం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది.

అధికారుల ప్రకారం విద్యుత్ శాఖలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లించబడుతున్నాయి. ఈ విభాగంలో నాలుగేళ్లకోసారి వేతన సవరణలు జరగడం వల్ల కొంతమంది సీనియర్ ఇంజనీర్ల నెల జీతం రూ.7 లక్షల వరకూ చేరిందని సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల్లో కొత్తగా చేరిన పారిశుధ్య కార్మికుల ప్రారంభ జీతం సుమారు రూ.28,000గా ఉంది. సుదీర్ఘ సేవ, ప్రమోషన్లు, అలవెన్సులు కలిపి కొంతమంది సీనియర్ పారిశుధ్య సిబ్బంది వేతనం రూ.70,000 దాటుతున్నట్లు స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. చాలా కాలం సేవ అనంతరం కొద్దిమంది ఉద్యోగుల జీతం రూ.2 లక్షల వరకు చేరిన ఉదాహరణలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి సాధారణ స్థాయి వేతనాలు కావని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంభవిస్తాయని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక రాష్ట్ర వ్యయ నిర్మాణం కూడా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు రూ.15 లక్షల కోట్ల వ్యయం జరిగితే, అందులో సుమారు రూ.12 లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లు, రుణాలు, వడ్డీలకు వెచ్చించినట్లు అంచనా. అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై కేవలం రూ.3 లక్షల కోట్లే ఖర్చు కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఆదాయ-వ్యయ సమతుల్యతపై ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us