Steel: భారత్ కు యుద్ధం తెచ్చిన కొత్త అవకాశం.. కానీ దేశీయ వినియోగదారులపై పెరుగుతున్న భారం..

Steel: భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ.. ఎగుమతుల్లో మన వాటా చాలా తక్కువగానే ఉంది. మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌లు(Russia Ukraine Crisis) మనకంటే తక్కువ స్టీల్‌ను తయారు చేస్తున్నాయి.

Steel: భారత్ కు యుద్ధం తెచ్చిన కొత్త అవకాశం.. కానీ దేశీయ వినియోగదారులపై పెరుగుతున్న భారం..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 09, 2022 | 6:00 AM

Steel: భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ.. ఎగుమతుల్లో మన వాటా చాలా తక్కువగానే ఉంది. మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌లు(Russia Ukraine Crisis) మనకంటే తక్కువ స్టీల్‌ను తయారు చేస్తున్నాయి. అయినప్పటికీ ఉక్కు ఎగుమతుల్లో(Steel Exports) ఆ రెండు దేశాల వాటా మన కంటే ఎక్కువగానే ఉందని చెప్పుకోవటం గమనార్హం. ఈ రెండు దేశాలు ఎక్కువగా తమ ఉక్కును యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. కానీ.. ప్రస్తుత యుద్ధం కారణంగా ఎగుమతులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్ లు వార్షిక ప్రాతిపదికన 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తున్నాయని బ్రోకింగ్ & రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా మాత్రమే యూరోపియన్ దేశాలకు 14-15 మిలియన్ టన్నులను ఎగుమతి చేస్తోంది. రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఉక్రెయిన్‌లో ఏర్పడిన అస్థిరత కారణంగా.. ప్రపంచ ఉక్కు వాణిజ్యంపై 12 శాతం ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ముగిసిన తరువాత కూడా ఉక్కు సరఫరా సధారణ స్థాయిలకు చేరటానికి సుమారు 6 నుంచి 8 నెలల కాలం పడుతుందని మోతీలాల్ సంస్థ నివేదిక చెబుతోంది.

ఈ కారణాల రీత్యా రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్కు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గత 15 రోజుల కాల వ్యవధిలో స్టీల్ ధరలు 27 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 18న బెంచ్‌మార్క్ హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ ధర టన్నుకు 947 డాలర్లు ఉండగా.. మార్చి 4 నాటికి ఆ ధర టన్నుకు1205 డాలర్లపైకి చేరుకుంది. యూరప్ లోని చాలా కంపెనీలు ఇప్పటికే స్టీల్ ధరలను పెంచడం ప్రారంభించాయి. ఈ పెరిగిన ఉక్కు ధరలే మన దేశంలోని ఉక్కు కంపెనీలకు కొత్త ఎగుమతి అవకాశాలను సృష్టించాయి. దేశంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతీయ ఉక్కు కంపెనీలు టన్నుకు1150 డాలర్ల ధరతో యూరప్‌కు ఉక్కును సులభంగా ఎగుమతి చేయగలవని వ్యాఖ్యానించారు. ఇది యూరప్‌లో ప్రస్తుతం ఉన్న ధర కంటే దాదాపు100 డాలర్లు తక్కువే. ప్రస్తుతం భారతీయ ఉక్కు పరిశ్రమలు టన్ను ఉక్కును సుమారు1000 డాలర్ల రేటుకు ఎగుమతి చేస్తున్నాయని ఆయన తెలిపారు.

ఏది ఏమైనప్పటికీ.. యూరప్ లో.. భారత్ లో తయారైన ఉక్కుకు డిమాండ్ పెరుగుతోంది. దీని కారణంగా ఫిబ్రవరిలో ఫినిష్డ్ ఉక్కు ఎగుమతి 76 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది. జాయింట్ ప్లాంట్ కమిటీ డేటా ప్రకారం.. ఫిబ్రవరిలో దేశం నుండి 11.57 లక్షల టన్నుల ఫినిష్డ్ స్టీల్ ఎగుమతి చేయబడింది. గతేడాది ఫిబ్రవరిలో దీని ఎగుమతి కేవలం 6.55 లక్షల టన్నులుగానే ఉంది. ఉక్కు ఎగుమతులు పెరగడం, దానికి అనుగుణంగా ప్రపంచ మార్కెట్లలో ఉక్కు ధరల పెరుగుదల కారణంగా.. దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు పెరగడం ప్రారంభమైంది. తాజాగా.. గత వారం దేశంలోని ఉక్కు కంపెనీలు వివిధ ఉక్కు ఉత్పత్తుల ధరలను టన్నుకు 5 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల వరకు పెంచాయి. ఉక్కు ప్రస్తుతం ఉన్న రేటు నుంచి ఇంకా పెరగవచ్చని భయాలు కూడా ఉన్నాయి. అంటే ప్రపంచ స్థాయిలో ఉక్కు ధరలు పెరగడం వల్ల మనదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. ఇదే సమయంలో దీని వల్ల దేశీయ వినియోగదారుల జేబులకు భారీగా చిల్లు పెడుతోంది.

ఇవీ చదవండి..

Navi IPO: మెగా ఐపీఓతో ముందుకొస్తున్న నావీ.. 97 శాతం వాటా కలిగి ఉన్న ఫిప్ కార్ట్ సహవ్యవస్థాపకుడు..

Crime News: పెళ్లికి ముందు పరారైన ప్రియుడు.. ఆ యువతి ఏం చేసిందంటే..