Plastic Currency: సడెన్గా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? RBI ప్లాన్ మాములుగా లేదుగా..
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. అయితే పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకురావడం అనేక అనేక నిజాలు దాగి ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో త్వరలోనే ప్లాస్టిక్ నోట్లను ఆర్బీఐ తయారుచేయనుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో వీటిని చలామణిలోకి తీసుకురానుంది. ఇప్పటికే చాలా దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను వినియోగిస్తున్నారు. అదే తరహాలోనే భారత్ కూడా పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను తీసుకురానుంది అయితే చాలామందిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్లు చెల్లుతాయా..? అసలు ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం వెనుక అసలు నిజాలు
ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్లను ప్రత్యేక కాటన్తో తయారుచేస్తున్నారు. ఇవి త్వరగా చిరిగిపోవడంతో పాటు మురికిగా మారుతున్నాయి. అలాగే ఒకరి చేతుల నుంచి మరొకరి చేతుల్లోకి మారడం వల్ల త్వరగా పాడైపోతున్నాయి. దీని వల్ల ఆర్బీఐ ప్రతీ ఏడాది చిరిగిపోయిన లేదా పాడైపోయిన నోట్లను సేకరించి రీసైకిల్ చేయాల్సి వస్తోంది. కాగితపు కరెన్సీ నోట్ల ప్రింటింగ్కు ఆర్బీఐ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే త్వరగా పాడైపోవడం వల్ల ఖర్చు వృథా అవుతోంది. అదే ప్లాస్టిక్ నోట్లతో అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నోట్లు 2 నుంచి 3 రెట్లు ఎక్కువకాలం మన్నుతాయి. అలాగే ఈ కొత్త నోట్లల్లో అత్యాధునిక హోలోగ్రామ్, పారదర్శక విండోలు వంటి హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. దీంతో నకిలీ నోట్లను తయారుచేయడం కూడా దాదాపు అసాధ్యమని చెబుతున్నారు.
ప్లాస్టిక్ నోట్ల వల్ల లాభాలు..
ప్లాస్టిక్ నోట్ల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కేవలం చిరిగిపోకుండా, పాడైపోకుండా ఉండటమే కాకుండా తేలికగా, సులభంగా ఉంటాయి. నీటిలో తడిసినా లేదా వాషింగ్ మెషిన్లో వేసినా నలిగిపోకుండా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో ఈ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్రం, ఆర్బీఐ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాలు పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలు ఈ నోట్లను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ కూడా చేరనుంది. తొలుత రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను తీసుకురానున్నారు. అయితే కొత్త ప్లాస్టిక్ నోట్లు వచ్చిన తర్వాత పాత నోట్లను చలామణి నుంచి క్రమక్రమంగా వెనక్కి తీసుకుకంటారు.
