Labour Rules: 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. కేంద్రం కొత్త ఓవర్ టైమ్ రూల్స్.. ఉద్యోగులకు పండుగే..
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఉద్యోగులకు ఉపయోగపడేలా అనేక మార్పులు చేసింది. ఓవర్ టైమ్ నిబంధనలను మార్చింది. ఇక నుంచి 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే అదనపు జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త లేబర్ కోడ్స్ రూల్స్ ప్రకారం కొత్త ఓవర్ టైమ్ నిబంధనలు కూడా వచ్చేశాయి. 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని రంగాల్లో పనిచేసేవారికి వర్క్-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సృష్టించేందుకు ఇవి ఉపయోగపడనన్నాయి. షెడ్యూల్ చేసిన షిప్ట్ కంటే ఎక్కువ టైమ్ పనిచేస్తే సాధారణ జీతం కంటే రెట్టింపు మొత్తం అందించాల్సి ఉంటుంది. కొత్త ఓవర్ టైమ్ నిబంధనల్లో అసలు ఏయే మార్పులు చోటుచేసుకున్నాయి..? ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు ఒకసారి చూద్దాం.
కొత్త నిబంధన ఏంటంటే..?
కొత్త కార్మిక కోడ్లను నవంబర్ 21,2025న కేంద్రం ప్రకటించింది. 24 కార్మిక చట్టాలను సవరించి నాలుగు ప్రధాన కోడ్లుగా రూపొందించింది. వీటిల్లో వేతన, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రతా, వృత్తి భద్రతా నియమావళి వంటివి ఉన్నాయి. ఓవర్ టైమ్, పని గంటల నియమాలను దేశవ్యాప్తంగా ఏకరీతిగా ఉంచడమే లక్ష్యంగా వీటిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పని చేయకూడదు. అంతకంటే ఎక్కువ సమయం పనిచేస్తే ఓవర్ టైమ్గా పరిగణిస్తారు. ఇలాంటప్పుడు రెట్టింపు జీతం చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ టైమ్ చెల్లించే ముందు ఉద్యోగి అనుమతిని యాజమాన్యం తీసుకోవాలి. ఉద్యోగుల హక్కులను బలోపేతం చేయడం, అదనపు పని గంటలను వారిపై రుద్దకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది.
ఫిర్యాదు చేయడం ఎలా..?
మెరుగైన పని పరిస్థితులను కల్పించడం, విశ్రాంతికి ఎక్కువ సమయం ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఓవర్ టైమ్ నిబంధనలను తీసుకొచ్చింది. మేనేజర్లు, పరిపాలనా సిబ్బంది ఓవర్ టైమ్కు అర్హులు కాదు. కొత్త కార్మిక చట్టాలు మేనేజర్లు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని ఉద్యోగుల వర్గం నుంచి తొలగించాయి. అందువల్ల వారిక ఓవర్ టైమ్ ప్రయోజనాలు అనేవి అందవు. ఇక ఓవర్ టైమ్ చేసినా రెట్టింపు జీతం ఇవ్వకపోతే ముందుగా యాజమాన్యంతో ఉద్యోగి పరిష్కరించుకోవాలి. అక్కడ సంతృప్తి కలగకపోతే లేబర్ కమిషనర్, ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ను సంప్రదించాలి. ఇక వేతన ట్రిబ్యునల్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ వద్ద కూడా ఫిర్యాదు చేయవచ్చు. అపాయింట్మెంట్ లెటర్లు, పే స్లిప్లు, అటెండెన్స్ రికార్డులు వంటివి ఫిర్యాదుతో పాటు అందించాలి. అనంతరం అధికారులు మీ ఫిర్యాదును పరిశీలించి చర్యలు చేపడతారు.
