Lotus cultivation: ఎకరం వరి చేలలో తామర సాగు.. భారీగా లాభాలు అర్ధిస్తున్న తండ్రి కొడుకులు
Lotus cultivation: ఏటా వరిపంటలో వచ్చే నష్టాల నుంచి తప్పించుకునేందుకు పంట మార్పిడి చేయాలనుకున్నానని రైతు యాళ్ల వీరబాబు తెలిపారు. మా అబ్బాయి సలహాతో 108 రేకుల తామరపూల సాగు గురించి తెలుసుకున్నాను. విత్తనాలు తీసుకువచ్చి ఎకరం పొలంలో సాగు చేశాను. పూలు బాగా వికసిస్తున్నాయి..

Lotus cultivation: వరి పంటకు ప్రత్యామ్నాయంగా తామరపూల సాగు చేపట్టి వినూత్న ప్రయోగం చేశారు ఓ రైతు. సాధారణంగా చెరువులు, కుంటల్లో కనిపించే తామరపూలను.. ఏకంగా వరి పొలంలోనే సాగు చేస్తున్నారు. అదీ 108 రేకుల తామరపూలు కావడంతో.. ఈ పంటను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. రాజానగరం మండలం కొత్తతుంగపాడులో తండ్రీకొడుకులు చేపట్టిన ఈ వినూత్న సాగుపై ప్రత్యేక కథనం.
వరి చేలో తామరపూల మొగ్గలు:
చూస్తే పచ్చని వరి పొలంలా కనిపిస్తుంది.. కానీ దగ్గరగా వెళ్తే అందమైన తామరపూలు కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా చెరువులు, కుంటల్లో పెరిగే తామరపూలను.. ఇక్కడ ఒక రైతు ఏకంగా ఎకరం పొలంలో సాగు చేస్తున్నారు. రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు యాళ్ళ వీరబాబు.. ఏళ్ల తరబడి వరి సాగు చేస్తున్నారు. అయితే వరికి గిట్టుబాటు ధర లేకపోవడం ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు రావడంతో.. ప్రత్యామ్నాయ పంట వైపు దృష్టి సారించారు. తండ్రితో కలిసి వ్యవసాయంలో పాలుపంచుకుంటున్న ఆయన కుమారుడు గంగాధర్.. తామరపూల సాగు చేయాలని సూచించారు. పండుగల సీజన్ కావడంతో తామరపూలకు డిమాండ్ ఉంటుందని భావించి.. ఏజెన్సీ ప్రాంతం నుంచి 108 రేకుల తామరపూల విత్తనాలను తీసుకొచ్చారు. గత జూన్ నెలలో ఎకరం పొలంలో విత్తనాలు జల్లారు. తొలుత చిన్న చిన్న మొగ్గలు వచ్చినా.. ఇప్పుడు అవి పూర్తిగా వికసించి 108 రేకుల తామరపూలుగా మారాయి.
ఇది కూడా చదవండి: రైతు మరణానంతరం భూమి ఎవరికి చెందుతుందా? పీఎం కిసాన్ డబ్బు ఎవరికి దక్కుతాయి?
పంట పండించడమే కాదు.. పూలను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కొత్తతుంగపాడు–ద్వారపూడి ప్రధాన రహదారి పక్కనే పొలం వద్ద చిన్న దుకాణం ఏర్పాటు చేసి.. తామరపూలను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు రెండు వేల తామరపూలను విక్రయించినట్లు రైతు వీరబాబు తెలిపారు. ఒక్కో పువ్వును పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా శ్రావణమాసం, వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి, దసరా వంటి పండుగల సమయంలో తామరపూలకు డిమాండ్ ఉండటంతో.. ఈ సాగు లాభసాటిగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.
ఏటా వరిపంటలో వచ్చే నష్టాల నుంచి తప్పించుకునేందుకు పంట మార్పిడి చేయాలనుకున్నానని రైతు యాళ్ల వీరబాబు తెలిపారు. మా అబ్బాయి సలహాతో 108 రేకుల తామరపూల సాగు గురించి తెలుసుకున్నాను. విత్తనాలు తీసుకువచ్చి ఎకరం పొలంలో సాగు చేశాను. పూలు బాగా వికసిస్తున్నాయి. కొత్తగా ఉండటంతో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. సాధారణంగా తామరపూలకు తక్కువ సంఖ్యలో రేకులు ఉంటాయని.. ఇక్కడ సాగు చేస్తున్న పూలకు 108 రేకులు ఉంటాయని చెబుతుండటంతో.. వీటిని చూసేందుకు, కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే విక్రయాలు సాగుతుండటంతో.. అటుగా వెళ్లే ప్రయాణికులు కూడా పూలను కొనుగోలు చేస్తున్నారు.
అయితే స్థానిక రైతు కుమారుడు ఎంఎస్సీ సైబర్ ఫోరెన్సిక్ చదివి రాజమహేంద్రవరంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నాన్నకు వ్యవసాయంలో సాయం చేస్తున్నారు. వరి పంటతో పెద్దగా లాభం రాలేదు. అందుకే పంట మార్చి చూద్దామని చెప్పానని కుమారుడు చెబుతున్నాడు. తామరపూల సాగు గురించి మిత్రుడి ద్వారా తెలుసుకున్నానని, ఈ ఏడాది సాగు చేసినట్లు చెప్పారు. పండుగల సమయంలో తామరపూలకు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నామని యువ రైతు గంగాధర్ తెలిపారు.
వరి సాగులో నష్టాలను ఎదుర్కొంటున్న అన్నదాతలు.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. తండ్రీకొడుకుల వినూత్న ఆలోచనతో.. వరి చేలో తామరపూల సాగు చేపట్టారు. పూలను పండించడంతో పాటు.. నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. వరి చేలో తామరపూల సాగుతో.. కొత్తదనానికి నాంది పలికిన ఈ రైతు ప్రయోగం మరెందరో అన్నదాతలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: India Post: మీ ఇంటి అడ్రస్ ఇక 10 అంకెల్లో.. DIGIPIN అంటే ఏమిటి? మీది ఎలా జనరేట్ చేసుకోవాలి?
ఇది కూడా చదవండి: Home Painting Costs: సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




