Indian Railways: ఇకపై సెకన్లలోనే రైల్వే టికెట్ల బుకింగ్.. త్వరలోనే హైస్పీడ్ రిజర్వేషన్ సిస్టమ్.. 40 ఏళ్ల నాటి వ్యవస్థ బంద్..
ప్రస్తుతం ఉన్న రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధ 1985 నుంచి అందుబాటులో ఉంది. కేవలం 15 సంవత్సరాల కోసం దీనిని అభివృద్ది చేయగా.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ప్రపంచంలో అతి పురాతనమైన టికెటింగ్ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. దీనిలో ఇప్పుడు మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? సర్వర్ స్లోగా ఉండి సమస్యలు ఎదుర్కొంటున్నారా..? ఒక్కొసారి వెంటనే టికెట్లు బుక్ అవ్వడం లేదా..? ఇలాంటి కష్టాలకు త్వరలో చెక్ పడనుంది. అత్యంత వేగంగా టికెట్లు బుక్ అయ్యేలా కొత్త రిజర్వేషన్ సిస్టమ్ను ఐఆర్సీటీసీ తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త సిస్టమ్పై వర్క్ జరుగుతోండగా.. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే సులభంగా, వేగవంతంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ స్లో అవ్వడం లాంటి సమస్యలు ఇందులో ఉండవు. ఈ మేరకు ఐఆర్సీటీసీ కొత్త రిజర్వేషన్ సిస్టమ్ను తీసుకురాడంపై కసరత్తు చేస్తోంది.
రూ.వెయ్యి కోట్లు ఖర్చు
ప్రస్తుతం ఉన్న రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ 48 ఏళ్ల నాటిది. మధ్యలో కొన్ని అప్గ్రేడ్లు చేయగా.. ఇప్పుడు పూర్తిగా కొత్త సిస్టమ్ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు రైల్వేశాఖ ఖర్చు చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.25 లక్షల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాట్ఫామ్ బుకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు వెబ్ సైట్ స్లో అవ్వడాన్ని తగ్గిస్తుంది. ఇక పీక్ బుకింగ్ సమయంలో సర్వర్ ఇష్యూస్ రావడం లాంటివి తగ్గుతాయి. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రయాణికులు అత్యంత వేగంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు వేగవంతమైన, సులభతరమైన ఆన్లైన్ రిజర్వేషన్ సర్వీసులను అందించడమే లక్ష్యంగా పాత కాలం నాటి రిజర్వేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(PRS) ఉండగా.. దీని స్థానంలో హైస్పీడ్ రిజర్వేషన్ ఫ్లాట్ఫామ్ తీసుకురానున్నారు.
సిస్టమ్ క్రాష్ సమస్యలకు చెక్
సర్వర్లు నెమ్మదించడం, బుకింగ్ వైఫల్యాలు, సిస్టమ్ క్రాష్ వంటి సమస్యలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో అయితే వెంటనే బుక్ అవ్వడం లేదు. దీంతో ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదు వస్తున్నాయి. దీంతో వేగవంతమైన, స్ధిరత్వం, సున్నితమైన అనుభవాన్ని అందించేందుకు ఈ కొత్త రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. రోజుకు దాదాపు 23 మిలియన్ల మంది సేవలు పొందుతున్నారు. ఈ కొత్త ఫ్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తే ఆటోమేటెడ్ బాట్ల వల్ల రిజర్వేషన్ కోల్పోకుండా సమర్ధవంతంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత బుకింగ్ సామర్థ్యానికి ఆరు రెట్ల వరకు కొత్త ఆర్కిటెక్చర్ ఉంటుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్పర్మేషన్ సిస్టమ్ కొత్త ప్రాజెక్టును చేపడుతోంది.
