BMI పూల్ అంటే ఏంటి? భారత్ దీన్ని ఎందుకు మొదలుపెట్టింది? పూర్తి వివరాలు ఇవే
ప్రపంచ ఉద్రిక్తతల నడుమ భారత్ తన వాణిజ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం రూ.12,980 కోట్ల హామీతో భారత్ మారిటైం ఇన్సూరెన్స్ పూల్ (BMI Pool) ఏర్పాటుకు ఆమోదించింది. ఇది విదేశీ బీమా సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, భారతీయ షిప్పింగ్కు సమగ్ర బీమాను అందిస్తుంది.

ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల మధ్య తన వాణిజ్య భద్రతను కాపాడుకునే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రూ.12,980 కోట్ల సార్వభౌమ హామీతో భారత్ మారిటైం ఇన్సూరెన్స్ పూల్ (BMI Pool) ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో విదేశీ బీమా సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. భారత వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా 70 శాతానికి పైగా, విలువ పరంగా దాదాపు 95 శాతం వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. అయినప్పటికీ ఈ విస్తార వ్యవస్థకు అవసరమైన బీమా సేవలు ఇప్పటివరకు ఎక్కువగా విదేశీ సంస్థల చేతుల్లోనే ఉండటం ఒక పెద్ద బలహీనతగా మారింది.
ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ప్రీమియంలు భారీగా పెరగడం లేదా కవరేజీ నిలిపివేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో BMI Pool ఒక రక్షణ కవచంలా పనిచేయనుంది. ఇది భారత జెండా కలిగిన నౌకలు, అలాగే భారత నియంత్రణలో ఉన్న నౌకలకు సమగ్ర బీమా కవరేజీ అందిస్తుంది. ఇందులో హల్ అండ్ మెషినరీ ఇన్సూరెన్స్, కార్గో ఇన్సూరెన్స్, అలాగే థర్డ్ పార్టీ బాధ్యతలను కవర్ చేసే P&I ఇన్సూరెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ నష్టాల బీమాను కూడా ఇందులో చేర్చడం ద్వారా అధిక ప్రమాద ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించడానికి ఇది కీలకంగా మారుతుంది.
ఈ చర్య ద్వారా అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం నుంచి భారతీయ షిప్పింగ్ కంపెనీలు కొంతవరకు రక్షణ పొందే అవకాశం ఉంది. లాజిస్టిక్స్ ఖర్చులు స్థిరంగా ఉండటం వల్ల ఎగుమతిదారులకు కూడా ప్రయోజనం కలగనుంది. దీని ద్వారా దేశం తన వాణిజ్య మౌలిక సదుపాయాలపై మరింత నియంత్రణను సాధించగలదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పూల్, మారిటైం ఇండియా విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారు. యునైటెడ్ కింగ్డమ్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి వ్యవస్థలను అమలు చేస్తున్న నేపథ్యంలో, భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. మొత్తం మీద ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యంలో వ్యూహాత్మక స్వావలంబన వైపు భారత్ తీసుకున్న ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
