Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి రెడీ.. కేంద్రం నుంచి బిగ్ అప్డేట్..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుంది..? ఈ ప్రశ్నకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో తొలి బుల్లెట్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

దేశంలో బుల్లెట్ ట్రైన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి సూపర్ న్యూస్. వచ్చే ఏడాదిలో దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మొదటి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లె్ల్ రైలు కారిడార్లో ఈ రైలు ప్రవేశపెట్టనున్నారు. ఈ కారిడార్ పనులు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుండగా.. ప్రస్తుతం 80 శాతం పూర్తయినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సూరత్- బిలిమోరా మధ్య తొలి రైలు పరుగులు తీయనుంది. 2027 ఆగస్టు 15న ప్రారంభం కానుందని అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయని, మిగతా కారిడార్ల పనులు దశలవారీగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
2027లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం
2027లో సూరత్-బిలిమోరా సెక్షన్ మొదటగా ప్రారంభించబడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మార్గంలో 2027 ఆగస్టు 15న తొలిసారిగా రైళ్లు నడవడం ప్రారంభిస్తాయని, ఆ తర్వాత ఇతర సెక్షన్లు ఒక్కొక్కటిగా ప్రారంభించబడతాయని చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టును పలు దశల్లో ప్రారంభించనున్నామని అన్నారు. సూరత్-బిలిమోరా సెక్షన్ ప్రారంభించాక.. వాపి-సూరత్ ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత వాపి-అహ్మదాబాద్, అహ్మదాబాద్-థానే మార్గాలు మొదలవుతాయన్నారు. చివరగా అహ్మదాబాద్-ముంబై సెక్షన్లను ప్రారంభిస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు ఉంటుంది. డిసెంబర్ 2029 నాటికి ఈ కారిడార్ పనులన్నీ పూర్తై పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
దేశంలో ఏడు బుల్లెట్ రైలు కారిడార్లు
దేశంలో మొత్తం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత ముంబై-అహ్మదాబాద్ కారిడార్ ప్రారంభం కానుంది. అనంతరం మిగతా కారిడార్ల పనులు స్టార్ట్ కానున్నాయి. అటు సెమీకండక్టర్ల తయారీ రంగంలో కూడా భారతదేశం వేగంగా పురోగమిస్తోందని అశ్విని వైష్ణవ్ అన్నారు. జూలై 4న ఆనంద్లో ప్రధాని మోదీ దేశంలోని మూడో సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రారంభించారని అన్నారు. మొదటి ప్లాంట్ను ఫిబ్రవరి 28న ప్రారంభించగా.. రెండవ ప్లాంట్ను మార్చి 31న ప్రారంభిస్తారు. సెమీకండక్టర్ల తయారీలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడంలో భాగంగా ఇది ఒక ప్రధాన ముందడుగుగా చెబుతున్నారు.
