AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చక్కెర ఎగుమతులపై నిషేధం! ఎందుకంటే?

భారత ప్రభుత్వం చక్కెర ఎగుమతులను తక్షణమే నిలిపివేసింది, ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలను స్థిరీకరించడం, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం. దేశీయ ఉత్పత్తి తగ్గుదల, వాతావరణ అనిశ్చితి ఈ నిర్ణయానికి దారితీశాయి.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చక్కెర ఎగుమతులపై నిషేధం! ఎందుకంటే?
Sugar Export
SN Pasha
|

Updated on: May 14, 2026 | 7:30 AM

Share

భారత ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం ముడి, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అమల్లో ఉండనుంది. దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు అదుపు తప్పకుండా చూడడం, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశ్యమని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రవాణా ప్రక్రియలో ఉన్న కొన్ని సరుకులకు మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. నిషేధానికి ముందు లోడింగ్ ప్రారంభమైన సరుకులు, భారత ఓడరేవుల వద్ద ఇప్పటికే లంగరు వేసిన నౌకలు, లేదా కస్టమ్స్‌కు ముందుగానే అప్పగించిన నిల్వలకు ఎగుమతి అనుమతి కొనసాగనుంది. దీంతో విదేశీ కొనుగోలుదారులతో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం విధానపరంగా పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ ఉత్పత్తి అవసరాలకు మించి ఉంటుందని అంచనా వేసిన కేంద్రం, 1.59 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇచ్చింది. కానీ ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో చెరకు దిగుబడులు తగ్గడం, వాతావరణ అనిశ్చితి పెరగడం పరిస్థితిని మార్చేశాయి. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌ వినియోగించే మొత్తానికి తక్కువ చక్కెరనే ఉత్పత్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ నిపుణులు అభివృద్ధి చెందుతున్న ఎల్‌నినో ప్రభావంపై కూడా హెచ్చరిస్తున్నారు. పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లో చెరకు సాగుకు కీలకమైన నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉండటంతో, భవిష్యత్ ఉత్పత్తిపై మరింత అనిశ్చితి నెలకొంది. బలహీనమైన వర్షాలు వస్తే సరఫరా ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆమోదించిన ఎగుమతి కోటాలో దాదాపు 8 లక్షల టన్నుల సరుకులకు ఒప్పందాలు కుదిరాయి. అందులో 6 లక్షల టన్నులకు పైగా సరుకు విదేశాలకు తరలిపోయినట్లు సమాచారం. ఇప్పుడు మిగిలిన సరఫరాలను ఎలా నిర్వహించాలన్న దానిపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉండటంతో, ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. ఆసియా, ఆఫ్రికా దేశాలు ఇప్పుడు సరఫరాల కోసం బ్రెజిల్, థాయిలాండ్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చక్కెర, తెల్ల చక్కెర ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, గ్లోబల్ సరఫరా గొలుసు అంతరాయాల మధ్య భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశీయ వినియోగదారులను ధరల షాక్ నుంచి రక్షించే ప్రయత్నంగానే కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us