UPI Payments: యూపీఐ లావాదేవీలు ఇకపై ఉచితం కాదు.. ఛార్జీలు చెల్లించాల్సిందే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ఇప్పటివరకు యూపీఐ లావాాదేవీలు ఉచితంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఛార్జీలు విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టగా.. దీనికి ఆమోదం కూడా లభించింది. యూపీఐ వ్యవస్థలో ఇది ఒక మార్పుగా చెప్పవచ్చు.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఛార్జీలను విధించే అధికారం బ్యాంకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్-2007 చట్ట సవరణకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును లోక్సభలో ఆమోదించారు. త్వరలో రాజ్యసభలో కూడా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదించాక ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా.. యూపీఐ వ్యవస్థలో ఇది పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఇక నుంచి యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు విధించనున్నారు.
యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా లేదా స్వీకరించాలన్నా ఉచితంగా ట్రాన్సాక్షన్లను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్, ఇతర యూటిలిటీ బిల్లులు లాంటివి చెల్లించే సమయంలో కొంత ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి పెద్ద వ్యాపారుల నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మీరు యూపీఐ ద్వారా డబ్బులు పంపితే.. మీ నుంచి సొమ్మును దుకాణాదారుడు స్వీకరించడానికి కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దుకాణాదారుడి నుంచి బ్యాంకులు ఈ రుసుంలు వసూలు చేయనున్నాయి. అయితే చిన్న దుకాణాలకు కాకుండా పెద్ద పెద్ద వ్యాపారుల నుంచి యూపీఐ లావాదేవీలకు ఈ రుసుంలు వసూలు చేయనున్నాయి. రూ.2 వేలుపైబడిన ట్రాన్సాక్షన్లకు ఈ ఛార్జీలు విధిస్తారని తెలుస్తోంది.
మర్చంట్ డిస్కౌంట్ రేటు అమలు..
గతంలో మర్చంట్ డిస్కౌంట్ రేటు పేరుతో వ్యాపారుల నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయగా.. 2020 నుంచి దీనిని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేటు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వల్ల సామాన్య ప్రజలు, చిన్న దుకాణాదారులపై ఎలాంటి ప్రభావం చూపించదు. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్లు, చిన్న వ్యాపారులకు చేసే లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగా చేసుకోవచ్చు. కేవలం పెద్ద వ్యాపారులపై మాత్రమే ఇది ప్రభావితం చూపిస్తుంది. ఈ నిధులను యూపీఐ వ్యవస్థ బలోపేతానికి ఉపయోగించనున్నారు. యూపీఐ నిర్వహణ, మౌలిక సదుపాయాల బలోపేతం కోసం వ్యాపారుల నుంచి వసూలు చేసే నిధులను వాడుకోనున్నారు. యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే పేమెంట్ అగ్రిగేటర్లకు కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. అయితే మౌలిక సదుపాయాల విస్తరణ తమకు భారం అవుతుందని పేమెంట్ అగ్రిగేటర్లు కేంద్రంపై ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తున్నారు.
