Gold Rate: ఈ ఏడాది చివరికి 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉండొచ్చు? నిపుణులు ఏం చెప్తున్నారు..
బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక పసిడిపై పెట్టుబడి పెట్టేవారి నుంచి శుభకార్యల కోసం కొనుగోలు చేయాలనుకునే వారి వరకు ధరల తగ్గుదల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు త్వరలోనే బంగారం తులం రూ. 56 వేలకు పడిపోతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్థిక నిపుణుల ఏమంటున్నారు.. ఈ ఏడాది చివరికి పది గ్రాముల ధర ఎంతకు చేరుతుంది అనే విషయాలు తెలుసుకుందాం..

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇప్పుడు మళ్లీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచే బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఈ ధరల పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఒక్క మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బంగారం కొనాలనుకునే వారి కోసం నిపుణులు తమ అంచనాలను ఇలా వెల్లడిస్తున్నారు.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ పరిస్థితులేనని భావిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా సుంకాలు విధించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత్వం నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదాన్ని గమనిస్తున్నారు. ఈ కారణంగా, సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెలలోనే బంగారం ధరలు దాదాపు 6.50 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధరలు 23% పెరిగాయి.
ఏడాది చివర్లో ఇలా ఉంటాయి..!
ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర ఎలా ఉండబోతుందనే దానిపై వివిధ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుడు జాన్ మిల్స్ ఒక అంచనా వేయగా, గోల్డ్మన్ సాక్స్ సంస్థ దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వారి అంచనాలు ఏమిటో, వాటి వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకుందాం.
జాన్ మిల్స్ అంచనా: రూ. 56,000 వద్ద స్థిరత్వం
అంతర్జాతీయ నిపుణుడు జాన్ మిల్స్ ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000 వద్ద స్థిరంగా ఉండవచ్చు. ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉందని, ఇకపై తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. వాణిజ్య సుంకల విషయంలో నెలకొన్న గందరగోళం మరికొన్ని రోజులు కొనసాగవచ్చని, ఆ తర్వాత బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు స్వీకరించడం ప్రారంభిస్తారని ఆయన అంచనా వేస్తున్నారు. దీనివల్ల మార్కెట్ స్థిరపడుతుంది మరియు పెట్టుబడిదారులు ఇతర మార్గాల వైపు మళ్లే అవకాశం ఉంది. ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గి ధర స్థిరపడుతుంది.
గోల్డ్మన్ అంచనా: బంగారం మరింత ప్రియం కావచ్చు
అదే సమయంలో, గోల్డ్మన్ సాక్స్ సంస్థ ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 3950 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. ఇంతకుముందు వారు 3700 వరకు పెరుగుతుందని అంచనా వేయగా, ఇప్పుడు ఆ అంచనాను పెంచారు. వారి ప్రకారం, బ్యాంకింగ్ రంగంలో మాంద్యం వచ్చే ప్రమాదం ఉండటం వల్ల కేంద్ర బ్యాంకులు మరింత బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. మాంద్యం సంభవిస్తే, బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలో ఇదీ పరిస్థితి…
భారతదేశంలో మాత్రం ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర రూ. 1 లక్షను దాటేస్తుందని భావిస్తున్నారు. అయితే, దీనికి గల నిర్దిష్ట కారణాలను స్పష్టంగా పేర్కొనలేదు. మొత్తానికి, ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు ఎలా ఉండబోతాయనే విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ధర స్థిరంగా ఉంటుందని ఒక నిపుణుడు భావిస్తుండగా, మరోవైపు బంగారం మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని మరొకరు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య సంబంధాలు వంటి అంశాలు రాబోయే రోజుల్లో బంగారం ధరలను నిర్దేశించనున్నాయి.