రూపాయి విలువ పడిపోతున్నా టెన్షన్ అక్కర్లేదు! RBI మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత రూపాయి విలువ క్షీణత ఆందోళన కలిగించినా, అతిగా భయపడాల్సిన అవసరం లేదని మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వురి సుబ్బారావు అన్నారు. బలహీన రూపాయి ఎగుమతులకు ఊతమిస్తుందని, 2013తో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బలంగా ఉందని ఆయన వివరించారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకోవాలని సూచించారు.

భారతీయ రూపాయి విలువ ఇటీవల అమెరికా డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించిన నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వురి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి బలహీనపడటం ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ, దానిపై అతిగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్లో 95.80 వరకు పడిపోయి, చివరకు 95.71 వద్ద ముగియడం మార్కెట్లలో చర్చనీయాంశమైంది. అయితే కరెన్సీ మార్పిడిలో కొంత స్థాయి ఒత్తిడి సహజమని, మార్కెట్ పరిస్థితుల ప్రకారం రూపాయి తన నిజమైన విలువను కనుగొనే అవకాశం ఇవ్వాలని సుబ్బారావు సూచించారు.
ఆయన అభిప్రాయం ప్రకారం బలహీనమైన రూపాయి ప్రతికూలతలతో పాటు కొన్ని ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా, దిగుమతి అయ్యే ముడి చమురు ఖర్చు పెరగడం వల్ల దేశంలో చమురు వినియోగం కొంత తగ్గవచ్చు. అదే సమయంలో భారతీయ ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లో మరింత పోటీ సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు. రూపాయి విలువ తగ్గడంతో విదేశీ కొనుగోలుదారులకు భారత ఉత్పత్తులు తక్కువ ధరలకు లభిస్తాయి కాబట్టి, ఎగుమతులకు ఊతం లభించవచ్చని ఆయన వివరించారు. 2013లో జరిగిన ఆర్థిక సంక్షోభంతో ప్రస్తుత పరిస్థితిని పోల్చిన సుబ్బారావు, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ గతంతో పోలిస్తే మరింత బలంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలు, ద్రవ్యలోటు నియంత్రణ, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం వంటి అంశాల్లో భారత్ మంచి స్థితిలో ఉందన్నారు.
2013 టేపర్ టాంట్రమ్ సమయంలో విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణ కారణంగా రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే ఇప్పుడు పరిస్థితులు అంతగా ప్రమాదకరంగా లేవని ఆయన భావిస్తున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితి మాత్రం ఇంకా అనిశ్చితంగానే ఉందని హెచ్చరించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా వడ్డీ రేట్ల విధానం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని కొనసాగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయిని కృత్రిమంగా ఒక స్థాయిలో నిలబెట్టేందుకు భారీగా జోక్యం చేసుకోవడం కంటే, అవసరమైనప్పుడు మాత్రమే ఆర్బిఐ జోక్యం చేసుకోవడం మంచిదని సుబ్బారావు సూచించారు. దీర్ఘకాలంలో మార్కెట్ ఆధారిత మారకపు విలువ వ్యవస్థే ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
