AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే రాజకీయవ్యూహం..తొలి షాక్ చంద్రబాబుకే !

ఏపీలో కనీవినీ ఎరుగని రాజకీయ వ్యూహానికి తెరలేస్తోంది. ఇంతకాలం అధికార పార్టీలోకి.. ప్రత్యర్థి పార్టీల నేతలను ఆకర్షించడం.. వారు తమ పదవులకు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) రాజీనామా చేయకుండానే పార్టీలు మారడం జరిగిపోయేది. అధికార పార్టీ ఆదేశాల మేరకు స్పీకర్లు.. వారిపై వచ్చే అనర్హత ఫిర్యాదులను ఏ నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో పెట్టేయడమే ఒక వ్యూహంగా జరిగిపోయేది. పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దానికి ఎలా తూట్లు పొడవాలో అన్ని రకాలుగా పొడిచేసి, ఆ […]

అదిరిపోయే రాజకీయవ్యూహం..తొలి షాక్ చంద్రబాబుకే !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 29, 2019 | 9:20 AM

Share

ఏపీలో కనీవినీ ఎరుగని రాజకీయ వ్యూహానికి తెరలేస్తోంది. ఇంతకాలం అధికార పార్టీలోకి.. ప్రత్యర్థి పార్టీల నేతలను ఆకర్షించడం.. వారు తమ పదవులకు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) రాజీనామా చేయకుండానే పార్టీలు మారడం జరిగిపోయేది. అధికార పార్టీ ఆదేశాల మేరకు స్పీకర్లు.. వారిపై వచ్చే అనర్హత ఫిర్యాదులను ఏ నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో పెట్టేయడమే ఒక వ్యూహంగా జరిగిపోయేది.

పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దానికి ఎలా తూట్లు పొడవాలో అన్ని రకాలుగా పొడిచేసి, ఆ చట్టాన్ని ఎందుకు కొరగాని చట్టంగా మార్చేసిన ఘనమైన దాఖలాలు గత కొన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాలతోపాటు.. వివిధ రాష్ట్రాలు, చివరికి జాతీయ స్థాయిలోను చూశాం. కానీ ఇప్పుడు సరికొత్త వ్యూహమొకటి అమల్లోకి రాబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఎన్నికల్లో ఓడినా, గెలిచినా అయిదేళ్ళపాటు అదే పార్టీకి లాయల్‌గా నాయకులు కొనసాగే పరిస్థితి చాలా కాలం క్రితమే కనుమరుగైంది. ఎందుకంటే కోట్లు పెట్టి గెలిచినా.. ఓడినా.. అధికార పార్టీలో వుంటూ.. ప్రభుత్వాధినేతల గుడ్ లుక్స్‌లో కొనసాగితే.. తర్వాత ఎన్నికల నాటికి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడంతోపాటు.. పోటీకి కావాల్సిన నిధుల్ని, స్పాన్సర్లను సమీకరించుకోవచ్చన్న అభిప్రాయంతోనే చాలా మంది గెలిచిన, ఓడిన నేతలుంటున్నారు. అందుకే.. ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టే తమ డెస్టినీ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దానికి అధికార పార్టీలు కూడా బలమైన ప్రతిపక్షం లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యం వహించాలన్న అధికార కాంక్షతో ‘‘ఆకర్ష్‘‘ పేరిట విపక్షంలో గెలిచిన వారికి వల వేయడం పరిపాటిగా మారింది.

కానీ.. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. తెరవెనుక కహానీలు వింటూ వుంటే మాత్రం.. ఏపీలో కనీవినీ ఎరుగని వ్యూహానికి రంగం సిద్దమవుతున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. బంపర్ మెజారిటీతో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని, విపక్ష ఎమ్మెల్యేలకు గాలమేయాల్సిన అవసరం తనకు లేదని పదే పదే చెప్పిన నేపథ్యంలో అదే మాటకు ఆయన కట్టుబడి వుంటున్నట్లు సమాచారం.

అయితే.. అధికార పార్టీతో కలిసి పోవడమే పరమావధిగా పెట్టుకున్న కొందరు టిడిపి నేతలు.. ఒక్కరొక్కరే వైసీపీకి టచ్‌లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. జగన్మోహన్ రెడ్డితో భేటీ అవడం, టిడిపికి రాజీనామా చేయడం.. తెలిసిందే. అయితే.. ఆయన సీరియస్‌గా రాజీనామా చేసి వుంటే స్పీకర్ ఫార్మెట్‌లో తన రాజీనామా లేఖను ఏకంగా అసెంబ్లీకే పంపేవారు. కానీ వంశీ అలా చేయకుండా.. టిడిపి అధినేతకు లేఖ రాస్తూ ఎమ్మెల్యే పదవికి, టిడిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే.. వంశీ వ్యూహమేంటా అని లోతుగా పరిశీలిస్తే.. పలువురితో సంభాషిస్తే.. జరుగుతున్న అతిపెద్ద వ్యూహం తాలూకా ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని విపక్ష నేత ఒకరు ఈ తతంగంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వల్లభేని వంశీతోపాటు సుమారు 8 మంది టిడిపికి దూరమవ్వాలన్న అభిప్రాయంతో వున్నట్లు తెలుస్తోంది. వీరంతా వైసీపీలో అధికారికంగా చేరాలంటే వారంతా రాజీనామా చేసి రావాలన్నది జగన్ అభిప్రాయం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించానన్న అపప్రధ తనపై పడకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

సో.. టిడిపికి దూరమవ్వాలన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసిన 8 మంది ఎమ్మెల్యేలు.. ఒకటింట మూడొంతులు (1/3) కింద ఏర్పడి.. తమని ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు లేఖ సమర్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారి అభ్యర్థన మేరకు శాసనసభలో వారికి ప్రత్యేక సీట్లు కేటాయిస్తే.. వారంతా.. సభలో సందర్భం దొరికిన ప్రతీసారి టిడిపిని, టిడిపి అధినేతను ఇరుకున పెట్టడంలో అధికార పార్టీకి సహకరిస్తూ వుండేలా వ్యూహం సిద్దమైనట్లు సమాచారం.

టిడిపికి దూరమవ్వాలనుకుంటున్నవారిలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి, రాయలసీమకు చెందిన ఓ సీనియర్ నేత వున్నట్లు సమాచారం. వీరంతా మరికొన్ని వారాల్లోనే.. అంటే శీతాకాల సమావేశాలకు ముందే తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ శాసనసభాపతిని కలిసే ఛాన్స్ బలంగా వుందని అమరావతి వర్గాల భోగట్టా. సో.. కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయన్నమాట. లెట్ అజ్ సీ.. వాట్ హ్యాపెన్స్..

Follow Us