భద్రాద్రి రోడ్డులో మందుపాతరల కలకలం
పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు ఒక్కటొక్కటే దొరుకుతుండడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతోంది. చర్ల మండలంలోని...
పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు ఒక్కటొక్కటే దొరుకుతుండడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతోంది. చర్ల మండలంలోని కలివేరు-తేగడ గ్రామాల మధ్యలో భద్రాచలం నుంచి చర్ల వెళ్ళే ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసు గస్తీ బృందాలు శనివారం కనుగొన్నాయి. ప్రధార రహదారిలోని మూలమలుపులో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మూడు మందుపాతరలను అమర్చారు. వీటిని కనుగొన్న పోలీసులు మొత్తం మూడు మందుపాతరలను నిర్వీర్యం చేశారు.
అయితే కలివేరు-తేగడ మధ్యలో దాదాపు అదే ప్రాంతంలో మరికొన్ని మందుపాతరలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసు గస్తీ దళాలు.. వాటిని గుర్తించే పనిని బాంబ్ స్క్వాడ్కు అప్పగించారు. దాంతో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తోంది. భద్రాచలం, చర్ల ప్రధాన రహదారిలో వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి, రోడ్డు ఇరువైపులా బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తోంది. ఈ తనిఖీలతో భద్రాచలం, చర్ల రహదారిపై సుమారు 4 కిలో మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి.