గంటాకు లైన్ క్లియర్.. 9న చేరడం ఖాయం!

ఎంతో కాలంగా కొనసాగుతున్న సస్పెన్సుకు ఆగస్టు 9వ తేదీన తెరపడబోతోందా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కీలక నేత పసుపు కండువాను పక్కన పెట్టేసి.. ఎంచక్కా ఆకుపచ్చ, తెలుపు రంగు కలిసిన కండువా కప్పుకోబోతున్నారా? అభీఙ్ఞ వర్గాలు నిజమనే అంటున్నాయి.

గంటాకు లైన్ క్లియర్.. 9న చేరడం ఖాయం!
Follow us

|

Updated on: Aug 06, 2020 | 3:57 PM

Green signal for Ganta Srinivas Rao to enter YSRC Party: ఎంతో కాలంగా కొనసాగుతున్న సస్పెన్సుకు ఆగస్టు 9వ తేదీన తెరపడబోతోందా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కీలక నేత పసుపు కండువాను పక్కన పెట్టేసి.. ఎంచక్కా ఆకుపచ్చ, తెలుపు రంగు కలిసిన కండువా కప్పుకోబోతున్నారా? అభీఙ్ఞ వర్గాలు నిజమనే అంటున్నాయి. రెండు పార్టీల నేతల్లో చాలా మంది.. ఆయన పార్టీ మారడం ఖాయమనే అంటున్నారు. ఇంతకాలం అటా ? ఇటా ? అన్నట్లు కొనసాగుతున్న సస్పెన్సుకు తెరదించే ముహూర్తం కుదిరిందని చెప్పుకుంటున్నారు.

ఎస్.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక నేతగా భావించే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు గురించే ఈ ఉపోద్ఘాతమంతా. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత.. పార్టీ మారే నేతల పేరుతో వస్తున్న ఊహాగానాల్లో గంటా శ్రీనివాస్ రావుదే పెద్ద పేరు. పలు కోణాల్లో కీలక నేతగా పేరున్న గంటా.. టీడీపీ గూటి నుంచి అధికార పార్టీలోకి మారితే.. ఉత్తరాంధ్ర రాజకీయల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

రాజధాని విశాఖకు తరలుతున్న క్రమంలో గంటా శ్రీనివాస్ రావు అధికారపార్టీలో చేరితే పార్టీకి ఎంతో ప్రయోజనకరమని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. గంటా రాకను ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల అంశంతోపాటు విశాఖలో వైసీపీ బలపడేందుకు గంటా అవసరమని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతలు బాహాటంగానే గంటా రాకను ధృవీకరిస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు సాగితే ఆగస్టు 9వ తేదీన గంటా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమని వైసీపీ వర్గాలంటున్నాయి. అయితే, గంటా చేరిక ఖాయం కావడంతో విశాఖ వైసీపీలో చక్రం తిప్పుతున్న పలువురు నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అయితే.. వీరిద్దరి మధ్య సమన్వయం వుండేలా చూసే బాధ్యతను వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు, విశాఖ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీకి అప్పగించినట్లు చెబుతున్నారు.