Big News Big Debate: ధాన్యంపై పాలసీ తేవాలన్న టీఆర్ఎస్ డిమాండ్ సాధ్యమేనా? వరి పంట కొనుగోలుకు మార్గమేది?
కొద్ది వారాలుగా వరిపై గల్లీల్లో తలపడ్డ పార్టీలు ఇప్పుడు పార్లమెంటు వేదికగా యుద్ధానికి దిగాయి. కేంద్రం పాలసీకి...
కొద్ది వారాలుగా వరిపై గల్లీల్లో తలపడ్డ పార్టీలు ఇప్పుడు పార్లమెంటు వేదికగా యుద్ధానికి దిగాయి. కేంద్రం పాలసీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు సభలో ఆందోళనకు దిగితే.. రాష్ట్ర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని కేంద్రంపై నిందలు వేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసలు వ్యవసాయ ప్రణాళికే లేదంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు డ్రామాలు కట్టిపెట్టి రోడ్లపై ధాన్యం కుప్పల దగ్గర చావుబతుకుల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలంటోంది కాంగ్రెస్.
వీ వాంట్ జస్టిస్. డోంట్ పనిష్ ఫార్మర్స్ అంటూ టీఆర్ఎస్ నినాదాలతో మార్మోగింది పార్లమెంట్ ప్రాంగణం. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు ఎంపీలు. జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానం తీసుకురావాలంటోంది టీఆర్ఎస్. ఇక అంతకుముందు లోక్సభ ప్రారంభం కాగానే తెలంగాణలో వరి కొనుగోలుపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ నినాదాలు చేశారు ఎంపీలు. రైతుల కోసం తమ ఆందోళన కొనసాగుతుందంటున్నారు. ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకు పార్లమెంట్లో నిలదీస్తామని హెచ్చరించారు ఎంపీలు.
ధాన్యం సేకరణలో సెంటర్కు ఓ విధానం ఉందని.. ప్రణాళిక లేకుండా సాగును సంక్షోభంలోకి తీసుకెళ్లింది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్ లేని వివాదం సృష్టించి రాజకీయం చేస్తున్నారన్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి… యాసింగి పంటపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలన్నారు. వర్షాకాలం పంటలో చివరి గింజ వరకూ కొంటామని కేంద్రం చెప్పినా రైతులను ఆయోమయానికి గురిచేస్తోందెవరు అని ప్రశ్నిస్తోంది బీజేపీ.
రెండు నెలలుగా రైతులు రోడ్లపై ధాన్యం రాసుల వద్ద పడిగాపులు కాస్తుంటే అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చలికాచుకుంటున్నాయని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆపి రైతులను ఆదుకోవాలన్నారు. కేసీఆర్ ఒకసారి రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. యాసంగి గొడవ ఆపి.. ముందు ఖరీఫ్ పంట కొనే మార్గం చూడాలన్నారు.
కేంద్రానికి విధానం లేదంటోంది టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆలోచన లేదంటోంది బీజేపీ. ఇద్దరికీ రైతుల పట్ల సానుభూతి లేకపోవడంతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అంటున్నాయి. ఇలా ఎవరికి వారు రాజకీయమేనా? రైతులకు న్యాయం చేసే ఉద్దేశం పార్టీలకు ఉందా.?