AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palnadu: గ్రైండర్‌లో మినప పిండి పడుతుండగా కరెంట్ షాక్.. వైసీపీ మహిళా నేత మృతి..

ఆమె వైసీపీ అధినాయకత్వం మంచి పదవి ఇచ్చింది. దీంతో ఫ్యామిలీ అంతా ఆనందంలో ఉంది. మరో నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంది. ఇంతలో విషాదం.

Palnadu: గ్రైండర్‌లో మినప పిండి పడుతుండగా కరెంట్ షాక్.. వైసీపీ మహిళా నేత మృతి..
YSRCP Flag
Ram Naramaneni
|

Updated on: Dec 16, 2022 | 3:13 PM

Share

విధి ఆట ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది ఈ ఘటన గురించి తెలసిన వెంటనే. ఆమె వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పనితీరు గుర్తించిన జిల్లా అధినాయకత్వం మంచి పదవి ఇచ్చింది. ఆ పోస్ట్‌కు మరో నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉందనగా.. ఆమె కరెంట్ షాక్‌తో మృతిచెందింది.  ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి మాజీ సర్పంచి చుండూరి రాఘవమ్మ… ఈపూరు మార్కెట్‌ యార్డు అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారానికి.. మంచి రోజు అవ్వడంతో ఈ నెల 19న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే గురువారం సాయంత్రం ఇంట్లో రాఘవమ్మ గ్రైండర్‌లో మినప పిండి పడుతున్నారు. ఇంతలో గ్రైండర్‌కు కరెంట్ పాస్ అవ్వడంతో  ఆమె షాక్‌కు గురయ్యారు. అక్కడే పడిపోయారు.  కాసేపటి ఆమె భర్త వెంకటేశ్వర్లు వెళ్లి చూడగా.. రాఘవమ్మ ఇంట్లో అచేతనంగా పడిపోయి కనిపించారు. దీంతో భీతిల్లిన ఆయన గట్టిగా అరిచి.. చుట్టుపక్కల వారిని పిలిచారు. వెంటనే ఊరిలో ఆర్‌ఎంపీని పిలవగా.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచిందని నిర్ధారించారు.

రాఘవమ్మ గతంలో సర్పంచిగా కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడు విశ్వనాథ్‌ యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఇంటికి పయనమయ్యాడు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఇతర వైసీపీ నేతలు రాఘవమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రాఘవమ్మ భర్త చుండూరి వెంకటేశ్వర్లు.. స్థానిక నేతలతో కలిసి గురువారం సాయంత్రం ఈపూరు యార్డును సందర్శించి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించారు. ఆ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారో లేదో ఈ ఘటన జరిగింది. దీంతో  గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం