Itlu Mee Niyojakavargam: మాచర్లలో ఎగిసిపడుతున్న పొలిటికల్ మంటలు.. పల్నాటి సీమ జనం జై కొట్టేది ఎవరికి..
స్వేఛ్చ కావాలి.. పల్నాడు ప్రతికారానికి ప్రతీక అయిన ఆత్మ గౌరవం కావాలి.. బానిసత్వం నుండి విముక్తి కోసం ప్రజలందరిని కూడ గడతానని ప్రతిపక్ష నేత బ్రహ్మారెడ్డి అంటే.. అరచకాలు, అలజడులు, అవీనితికి పాల్పడితే గత ముప్పై ఏళ్లుగా ఎందుకు ప్రజలు తమకు పట్టం గడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రశ్నిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు కోటలు దాటుతున్న అభివ్రద్ది మాత్రం పల్నాడు గడప దాటి లోపలికి రావటం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పౌరుషాల గడ్డ పల్నాడులో రాజకీయం… సలసల కాగిపోతోంది. ఎన్నికలకు ఏడాది ముందే… ఇక్కడ పొలిటికల్ యుద్ధం మొదలైపోయింది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు.. పాత రోజుల్ని గుర్తుకు తెస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి కృష్ణారెడ్డికి.. ఈ పల్నాటి సీమ పెట్టని కోటగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు దఫాలుగా జయకేతనం ఎగరేస్తూ తన పట్టు నిలుపుకొంటున్నారాయన. అదే జోరుతో..డబుల్ హ్యాట్రిక్కు సై అంటున్నారు. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరుతెచ్చుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… 2009 నుంచి ఇక్కడ జైత్రాయాత్ర కొనసాగిస్తున్నారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలిచినా.. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్ సూచనతో… రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చారు రాజశేఖర్రెడ్డి. అలా మొదలైన అభిమాన పర్వం.. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. 2012లో జగన్కోసం కాంగ్రెస్కు రాజీనామా చేసి… ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన రామకృష్ణారెడ్డి… ఆ తర్వాత సైతం తన విక్టరీస్ని కంటిన్యూ చేశారు.
వైఎస్ కుటుంబంపై పిన్నెల్లి ఫ్యామిలీ ఎంత విశ్వాసం చూపిస్తుందో.. అదేస్థాయిలో పిన్నెల్లి కుటుంబంపై నమ్మకం ఉంచుతున్నారు మాచర్ల ఓటర్లు. బైపోల్తో కలిపి మొత్తంగా ఐదుసార్లు గెలిచిన పిన్నెల్లి… ఆరోసారి కూడా విజయం పక్కా అనే ధీమాతో ఉన్నారు. మరి పరిస్థితులు అలా ఉన్నాయా అంటే? మాత్రం… అవి ఎలాగున్నా ఈసారి వార్ వన్సైడ్ కాదనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీనికి కారణం ప్రత్యర్థి సైతం.. సై అంటూ తొడగొడుతుండటమే.
ప్రజలు ఈసారి మార్పు కొంటున్నారా?
అధికార పార్టీలో పెద్దగా ఇబ్బందులేం లేకపోయినా… పిన్నెల్లికి ఈ దఫా గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా ఐదుసార్లు గెలవడం వల్ల… ఇక్కడి ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే, పిన్నెల్లి ఈసారి.. మరోచోట నుంచి పోటీ చేస్తారనే ముచ్చట కూడా లోకల్ పాలిటిక్స్లో అప్పట్లో షికారు చేసింది. అయితే, అదంతా ఏం లేదనీ… తనను రాజకీయంగా ఎదుర్కోలేనివారు.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపారేశారు పిన్నెల్లి. మళ్లీ బరిలో ఉండేదీ నేనే.. గెలిచేదీ నేనే అంటూ.. అంతులేని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి పక్కా స్కెచ్తో టీడీపీ రెడీ!
వరుసబెట్టి అభ్యర్థులను మార్చినా… ఐదు దఫాలుగా గెలుపు మార్క్ను మిస్సవుతున్న టీడీపీ… ఈసారి పక్కా స్కెచ్తో రెఢీ అవుతోంది. ఇన్నాళ్లూ ఒకలెక్క.. ఇకమీదట ఒక లెక్క.. అంటోంది. వరుస విజయాలతో జోరుమీదున్న పిన్నెల్లి స్పీడుకు… బ్రేకులేసేందుకు పెద్ద వ్యూహాలే రచిస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల ముందే… ఇక్కడ పార్టీ ఇంచార్జ్గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించింది. జూలకంటి ఫ్యామిలీకి సైతం.. మాచర్లలో మంచి పట్టే ఉన్నా… కొన్నేళ్లుగా సైలెంట్ అయ్యింది. బ్రహ్మారెడ్డి తల్లిదండ్రులిద్దరూ.. ఇక్కణ్నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించి ఉన్నారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లు, హత్యలు.. ఇప్పటికీ మాచర్ల రాజకీయాల్లో రగడకు కారణమవుతూనే ఉంటాయ్. మంచి పొలిటికల్ బ్యాగ్రౌండ్తోనే రెండుసార్లు టీడీపీ నుంచి పోటీచేసిన బ్రహ్మారెడ్డికి విజయం మాత్రం దక్కలేదు. 2009లో ఓటమి తర్వాత కామైపోయిన బ్రహ్మారెడ్డిని.. ఇప్పుడు మరోసారి మాచర్ల ఇంచార్జ్గా నియమించింది టీడీపీ హైకమాండ్.
బ్రహ్మారెడ్డి ఎంట్రీతో పొలిటికల్ సీన్ మారిపోయిందా?
యాధృశ్చికమో.. కాకతాళీయమో గానీ…. బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత మాచర్లలో పొలిటికల్ సీన్ మారిపోయింది. కక్షలు, కార్పణ్యాలకు వేదికైన మాచర్లలో పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ… పొలిటికల్ మంటలు మొదలయ్యాయి. ఆ మధ్య ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య… ఆ తర్వాత జరిగిన పొలిటికల్ రచ్చ… ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం మాచర్ల వైపు చూసేలా చేశాయ్. అలా మొదలైన రచ్చ.. కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి ఫ్యాక్షన్ రాజకీయానికి వైసీపీ తెరలేపిందంటూ టీడీపీ అంటుంటే… బ్రహ్మారెడ్డి వచ్చాకే మళ్లీ హత్యారాజకీయం మొదలైందని వైసీపీ… పరస్పర ఆరోపణలు చేసుకుంటూ అగ్గికి ఆజ్యం పోస్తున్నాయ్. దీంతో, ఇన్నాళ్లూ వన్సైడ్ అన్నట్టుగా సాగిన మాచర్ల రాజకీయం… మలుపులు తిరుగుతూ.. వచ్చే ఎన్నికల నాటికి టగ్ఆఫ్ వార్ తప్పదన్నట్టు తయారైంది. అభ్యర్థులను మార్చిమార్చి అదృష్టాన్ని పరీక్షించుకున్న టీడీపీ.. ఈ దఫా కచ్చితంగా గెలిచి తీరాలన్న కసితో ఉంది. మొత్తానికి, తాజా ఘటనలతో తెలుగు తమ్ముళ్లు బాగా యాక్టివ్ కావడంతో సైకిల్జోరు కూడా పెరిగింది. అటు, అధికార పార్టీ కూడా సై అంటుండటంతో… మాచర్లలో పొలిటికల్ మంటలు ఎగిసిపడుతున్నాయ్.
రెడ్లి, ముస్లిం, యాదవ.. కాంబినేషన్ పనిచేస్తోందా?
సామాజిక కోణంలో చూస్తే… మాచర్ల రాజకీయాల్లో రెడ్లదే రాజ్యం. కమ్మ, యాదవ, ఎస్సీ మాదిగ వర్గాలు అధికంగా ఉన్నా… ఇక్కడి రాజకీయాలను ప్రభావం చేసేది మాత్రం రెడ్లే. ఇప్పటిదాకా ఇక్కడ 15సార్లు ఎన్నికలు జరిగితే… అందులో 6సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ, మూడుసార్లు వైసీపీ.. మరోరెండు సార్లు ఇతరులు విజయం సాధించారు. వీరిలో ఎక్కువ శాతం రెడ్డి నాయకులే కావడం విశేషం. మాచర్లలో రెడ్డి, ముస్లిం, యాదవ్ ఓటర్ల కాంబినేషన్ గెలుపోటములను డిసైడ్ చేస్తోంది. పలు దఫాలుగా పిన్నెల్లికి అదే కలిసివస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరి, ఈసారి ఈక్వెషన్స్ ఎలా మారుతాయో చూడాలి.
అభివృద్ధిపైనా మాటల యుద్ధమే!
రాజకీయమే కాదు.. అభివృద్ధి ముచ్చట సైతం… పార్టీల మధ్య మంటలు పుట్టిస్తోంది. అభివృద్ధి కంటే రాజకీయాలకే అధికార ప్రాధాన్యమిస్తోందంటూ టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి ఆరోపిస్తుంటే… నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి.
మూడు దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయదుర్గాన్ని నిర్మించుకున్న పిన్నెల్లి కుటుంబంపై… ప్రతిపక్షాలు కబ్జా ఆరోపణలు గుప్పిస్తున్నాయ్. కనిపించిన ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు వదలడం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నాయ్. అయితే, ఈ అలిగేషన్స్ని అదే స్థాయిలో తిప్పికొడుతోంది ఇక్కడి అధికార పక్షం.
ప్రశాంతత పోగొట్టిందెవరు? మంటలు పెడుతున్నదెవరు?
పగలు, కక్షలతో ఉడికిపోయే పల్నాటి గడ్డమీద… ప్రశాంతతను తీసుకొచ్చామని వైసీపీ చెబుతోంది. అయితే, మంటలు పెడుతున్నదే వైసీపీ అంటోంది ప్రతిపక్ష టీడీపీ. ప్రధాన పార్టీల ఈ పరస్పర ఆరోపణలతో మరోసారి పాతరోజులు గుర్తొస్తున్నాయ్ మాచర్ల జనాలకు.
వరికపూడిశెల ఎత్తిపోతల పథకం సంగతేంటి?
వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీఇచ్చినా.. అదింకా పూర్తి కాకపోవడం ఎమ్మెల్యేకు మైనస్సని చెప్పాలి. అందుబాటులోకి రాని మిర్చి మార్కెట్ యార్డు.. పట్టణంలో వేధిస్తున్న తాగునీటి సమస్య… ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయ్. అయితే, దానికి అధికార పక్షం చెప్పే సమాధానం మరోలా ఉంది.
రూ.1200కోట్లతో రికార్డుస్థాయి అభివృద్ధిపనులు!
ఒకటి కాదు, రెండుకాదు… 1200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నది అధికార వైసీపీ నేతలు చెబుతున్న మాట. నియోజకవర్గ చరిత్రలో ఇదో రికార్డంటున్నారు. నాగార్జున సాగర్ టు దావుపల్లి… మాచర్ల టు దాచేపల్లి… రహదారి పనులే అందుకు నిదర్శనమంటున్నారు.
అల్లర్లు, గొడవలతోనే మాచర్లకు ఫేమొచ్చిందా?
రాజకీయంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. మునుపటి మాదిరి భయానక పరిస్థితులు లేవు. అయినా సరే.. అల్లర్లు, గొడవలు, ఫ్యాక్షన్ రాజకీయాలతోనే ప్రచారంలో ఉంటోంది మాచర్ల. ముందు.. అది మారాలంటున్నారు లోకల్ జనం. మరి, తాము కోరుకుంటున్న మార్పు దిశగా వచ్చేసారి ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం