కోడి పందేలకు సై అంటున్న ఉభయగోదావరి జిల్లాలు.. బరులు సిద్ధం చేస్తున్న పందెంరాయుళ్లు
సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలకు ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు..
Sankranti Kodi Pandalu : సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలకు ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా పందేలకు సంబంధించిన పలులు జరిగిపోతున్నాయి.
కోర్టుల ఆదేశాలు.. పోలీసుల హడావుడి… మైకుల్లో ప్రచారాలు, కత్తులు, పుంజుల స్వాధీనం, బరుల ధ్వంసం, నిర్వాహకుల అరెస్టులు అన్నీ సాగిపోతున్నాయి. ఇవన్నీ మామూలే.. పండగ మూడు రోజులూ పందేలు జరుగుతాయి. మీరొచ్చేయండి.. అంటూ వివిధ రాజకీయ పార్టీ నాయకుల సందేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగినట్టుగా పందేల బరులూ సిద్ధమైపోతున్నాయి.
నిర్వాహకులు కోళ్లు, కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు. ఓచోట పోలీసులు బరిని ధ్వంసం చేస్తే.. మరోచోట బరులు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ గేలరీలు, పేకాటకు ఫ్లడ్లైట్లు, భారీగా మద్యం దుకాణాలు అన్ని ఏర్పాట్లూ చకచకా సాగిపోతున్నాయి.
ఇంకా పెద్ద బరులకు ఆ స్థాయిని బట్టి బేరాలు సాగుతున్నాయి. నూజివీడు సమీప జనార్దనవరం, కొప్పాక ప్రాంతాల్లో పందేల నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కోడిపందేల బరుల వద్ద మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లోనూ పేకాట సాగేందుకు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే.. గత ఏడేళ్లుగా సంప్రదాయ డింకీ పందేలను భీమవరంలో ఎంపీ కనుమూరి రాఘురామకృష్ణంరాజు లాంఛనంగా ప్రారంభించేవారు. ఈసారి ఆయన భీమవరం రావడం లేదని సన్నిహితులు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది వెంపలోనూ, ఆ పక్కనే ఉన్న భీమవరంలోనూ పందేలు నిలుపుదల చేశారు.