E-Magic Box App: ఇ-మ్యాజిక్ బాక్స్ వచ్చేస్తుందోచ్.. ఇక మూడో తరగతి నుంచే AIలో పాఠాలు!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇపుడు అన్ని రంగాలపైనా ప్రభావం చూపిస్తుంది. అయితే భారతదేశంలాంటి పెద్ద దేశంలో పాఠశాల స్థాయి నుంచి ఏఐ బోధన అనుసంధానం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం CBSE ఇందుకోసం రంగం సిద్ధం చేస్తుంది. ఈ భోదన 3 వ తరగతి నుంచి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని ప్రాథమిక అంశాలు వచ్చే ఏడాది నుంచి బోధించబోతున్నారు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లే కొద్దీ పాఠ్యాంశాల్లో స్థాయి సైతం పెరుగుతూపోతుంది..

ఏలూరు, ఫిబ్రవరి 20: భారత్ ను “ఏఐ పవర్ హౌస్” గా తయారుచేసేందుకు స్కూల్స్, కాలేజీల స్థాయిలో సిలబస్లో మార్పుచేర్పులు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020’ ఇప్పటికే కోడింగ్, డిజిటల్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ‘డిజిటల్ ఇండియా’ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరువవుతుండటంతో పాటు PM e-VIDYA వంటి పథకాలు డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తుండటం అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. భారత్లో టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న యువత ఎక్కువ. చిన్న వయస్సు నుంచే ఫోన్లు, ట్యాబ్లు వాడటం వల్ల పిల్లలు ఈ సాంకేతికతను త్వరగా నేర్చుకోగలరని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ – మ్యాజిక్ బాక్స్ యాప్
NCERT ఒక ప్రత్యేకమైన డిజిటల్ ప్లాట్ ఫారంను ప్రారంభించింది. దానిపేరు “ఈ – మ్యాజిక్ బాక్స్” యాప్. ఇది ఏఐ సహాయంతో పని చేస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. పిల్లలు ఆటపాటల ద్వారా నేర్చుకోవడం, పెద్దలు వారి అభ్యాస ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడం దీని ప్రధన లక్ష్యంగా చెబుతున్నారు. ఇందులో కథలు, పాటలు, ఆసక్తికరమైన యక్టవిటీలు అందుబాటులో ఉండటంతో పాటు ఇంటరాక్టివ్ గైడెన్స్ ఒకే చోట లభిస్తుంది. ఈ యాప్ మూడు ఏఐ బోట్ల సహాయంతో పనిచేస్తుంది. AI బాట్లు (AI Bots) సులభంగా చెప్పాలంటే.. మనుషులలాగే ఆలోచించి, మనతో మాట్లాడగలిగే లేదా మన పనులు చేయగలిగే “తెలివైన కంప్యూటర్ ప్రోగ్రామ్స్”. ఇవి విద్యార్థుల ప్రశ్నలకు వెంటనే సమాధానమిస్తూ నేర్చుకునే ప్రక్రియను సులభతరం చేస్తాయి.
అయితే కేవలం సిలబస్ మార్చితే సరిపోదని లక్షలాది మంది ఉపాధ్యాయులకు AI గురించి సరైన అవగాహన కల్పించడం అతి పెద్ద సవాలుగా ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. గ్రామీణ – నగరాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు. నగరాల్లోని ప్రైవేట్ స్కూళ్లలో కంప్యూటర్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉంటాయి. కానీ మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని, ఇది కేవలం మార్కుల కోసమో లేదా యాప్ల అమ్మకం కోసమో కాకుండా, పిల్లల్లో విశ్లేషణాత్మక ఆలోచనను పెంచేలా ఉండాలని చెబుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




